Wednesday, July 2, 2008

వర్గం -2

వర్గం - 2
మూలపాఠాలు (TEXTS)

ఒక సమూల విప్లవం గురించిగానీ, లేక సార్వత్రిక మానవ విమోచనగురించిగానీ జర్మనీ ఊహాస్వర్గ స్వప్నం ఏదీ కనలేదు; ఆ ఊహాస్వప్నమంతా ఒక పాక్షిక, శుద్ధ రాజకీయ విప్లవంగురించి మాత్రమే. ఇలాంటి విప్లవం [పాత] కట్టడాన్ని సమూలంగా ధ్వంసం చేసివేయదు; ఆ పాతకట్టడపు ఆధారస్తంభాలను అలాగే నిలిపి వుంచుతుంది. ఇలాంటి పాక్షిక, శుద్ధ రాజకీయ విప్లవానికి ప్రాతిపదిక ఏమిటి? పౌర సమాజంలో ఒక భాగం దాన్నది విముక్తి గావించుకుని, ఒక సార్వత్రిక ఆధిపత్యం సాధిస్తుందని [అలా సాధించడానికి గాను?], ఏదైనా ఒక ప్రత్యేక వర్గం దాని ప్రత్యేక పరిస్థితినుండి సమాజపు సాధారణ విమోచనను సాధించ పూనుకుంటుంది. ఈ వర్గం యావత్‌ సమాజాన్నీ విముక్తి [స్వతంత్రం] గావిస్తుంది గాని, అది [యిలా విముక్తి చే్యడం] ఆ సమాజం మొత్తమూ ఈ వర్గం వున్న పరిస్థితిలోనే వున్నదనీ, యింకా అది [కొన్ని లాభాల్ని,] ఉదాహరణకు, డబ్బూ, విద్యా కలిగి వుంటుంది [వుండగలదు] లేక వాటిని తేలిగ్గా సముపార్జించుకో గలదనే ముందుఊహ (presupposition) పై ఆధారపడి మాత్రమే.
పౌర సమాజంలో ఏ వర్గమైనాగానీ ఈ [విమోచక] పాత్రను దానిలో అదిగానూ, యింకా సాధారణ ప్రజానీకంలోనూ ఒక సముత్సాహిత సమయాన్ని లేక ఉద్రేక స్థితిని [a moment of enthusiasm] రెచ్చగొట్టకుండా నైతే నిర్వర్తించలేదు. ఆ వర్గం యావత్‌ సమాజంతో సోదరభావంతో మెలగుతూ, అది స్వయంగా ఆ సమాజంలో కరిగిపోయే [మహత్తర] ఘడియ అది. ఆ వర్గం [ఆ సమయంలో] తన్ను తాను సమాజంతో మమేకంగావించుకొంటుంది; అలాగే సమాజమంతాకూడ ఆ వర్గం తన సాధారణ ప్రతినిధి అని అనుభూతి చెందడమేగాక ఆ వర్గాన్ని అలా గుర్తిస్తుందికూడ. ఆ వర్గం అప్పుడు సమాజపు నిజమైన సాంఘిక అధిపతి [పెద్ద] గా, సమాజపు గుండె [హృదయం] గా వుంటుంది; కనుక ఆ వర్గపు హక్కులు, స్వామ్యాధికారాలు [rights and claims] సమాజం మొత్తపు హక్కులు, స్వామ్యాధికారాలుగా వుంటాయి. ఏదైనా ప్రత్యేక వర్గం తన సాధారణ ఔన్నత్యం [general supremacy] న్యాయసమ్మతమైందని నిరూపించుకోవాలంటే అది సమాజపు సాధారణ హక్కుల పేరిటమాత్రమే సాధ్యంకాగలదు. విమోచనకర్తగా ఈ స్థితిని సంపాదించుకొనడానికి, తద్వారా తన సొంత క్షేత్ర [వర్గ మరియు సన్నిహిత బృందాల] ప్రయోజనాలకోసమని సమాజపు సకల క్షేత్రాల్నీ [తనకనుకూలంగా] వినియోగించుకోవాలంటే, కేవలం విప్లవ శక్త్యుత్సాహాలూ, బౌద్ధిక [మేధో] ఆత్మ విశ్వాసం వున్నంత మాత్రంలో సరిపోదు. ప్రజా విప్లవమూ, పౌరసమాజపు ఏదైనా ఒక ప్రత్యేక వర్గపు విమోచనా రెండూ ఏకకాలంలో సంభవించాలంటే, మొత్తం సమాజపు ప్రతినిధిగా ఒక వర్గం నిలవగలగాలంటే, అందుకుగాను యావత్‌ సమాజపు లోటుపాట్లన్నీ ఇంకో మరే వర్గంలోనైనా కేంద్రీకరించబడి వుండాల్సివస్తుంది; ఆ మరో వర్గం సార్వత్రిక అపనిందకు గురై సమాజపు అన్ని పరిమితుల [నైతిక ఆంక్షల] కు లోనై [ఏవగించుకోబడుతూ] వుండాల్సివుంటుంది.. ఒక ప్రత్యేక సాంఘిక క్షేత్రం మొత్తం సమాజపు కుఖ్యాత నేరభరిత క్షేత్రంగా పరిగణించబడాల్సి వుంటుంది; అలాంటప్పుడే, ఆ క్షేత్రపు విమోచన ఒక సార్వత్రిక స్వీయవిమోచనగా గోచరించగలదు. అంటే, ఏదైనా ఒక వర్గం సర్వశ్రేష్టమైన విమోచక వర్గంగా గోచరించాలంటే, ఏదైనా యింకో వర్గం, అందుకు తలకిందులుగా, దోపిడీ, పీడనల కంతటికీ ఆలవాలమైన వర్గంగా అగుపించాల్సి వుంటుంది. ఫ్రెంచి కులీన ప్రభువర్గం, మతగురు వర్గాల సార్వత్రిక రుణాత్మక [వ్యతిరేక ప్రభావపు] ప్రాధాన్యం, వాటికి అత్యంత దగ్గరగావుంటూనే వాటికి విరుద్ధంగా నిలిచిన మరో వర్గపు – అంటే, బూర్జువా వర్గపు – సార్వత్రిక ధనాత్మక (నిశ్చయాత్మక) ప్రాముఖ్యతను నిర్ణయించింది [అని గమనించాలి]. - హెగెల్‌యొక్క హక్కుసంబంధ తత్వచింతనకు పరిచయం (1844), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 71.
కనుక ఒక జర్మన్‌ విమోచనకు నిజమైన అవకాశం (సాధ్యత) ఎక్కడ వుంది?
మా జవాబు: సమూలమార్పువాద సంకెళ్ల (radical chains – తీవ్ర వాద బంధాలు?) తో కూడుకున్న ఒక వర్గం ఏర్పాటులో [అనేదే మా జవాబు] – ఆ వర్గం పౌర సమాజంలోనే వుంటుంది కాని పౌర సమాజానికి చెందివుండే వర్గం అయివుండదు; అదొక సాంఘిక బృందమే గాని నిజానికి అది సకల సాంఘిక బృందాల విచ్ఛిత్తి పరిణామం; తన సార్వత్రిక బరువుబాధల మూలంగా ఒక సార్వత్రిక స్వభావాన్ని సంతరించుకొనివున్న ఒక క్షేత్రానికి చెందివుంటుందది; అది ఏదో ఒక ప్రత్యేక అన్యాయానికి గురయివుంటుందన్నట్లుగాక, సాధారణంగా సమస్త అన్యాయానికీ గురయ్యే కర్మవస్తువుగా వుంటుంది గాబట్టి అది ఏదో ఒక ప్రత్యేక హక్కు కోసమే ఆరాటం చేస్తుందన్నట్లుండదు. ఈ వర్గం మరెంతమాత్రమూ ఒక చారిత్రక హోదా [అంతస్తు - status] కోసంకాక, కేవలం ఒక మానవీయ హోదా కోసమే కృషి చేస్తుంది [గొంతెత్తుతుంది]. జర్మన్‌ రాజకీయ రాజ్యతంత్ర పర్యవసానాలకు ఏకపక్షీయ ప్రతిఘటనగామాత్రమేనైతే అది వుండదు; ఆ రాజ్యతంత్రపు ముందుఊహలన్నింటికీ పూర్తి వ్యతిరేకతతో వుంటుంది. అంతిమంగా, తన్ను తాను సమాజంలోని యితర అన్ని క్షేత్రాలనుండీ విముక్తి చేసుకోకుండా, తద్వారా స్వయంగా [అసలుకు] ఈ యితర క్షేత్రాలన్నింటినీ విముక్తం గావించకుండా తన్ను తాను సైతం విమోచనగావించుకోలేని క్షేత్రం అది. ఒక్క మాటలో, అది మానవజాతికే సంపూర్ణ విమోచన. మొత్తం సమాజం ఒక ప్రత్యేక వర్గంగా విచ్ఛిన్నమవడమే అధోకార్మిక వర్గ ఆవిర్భావం. - హెగెల్‌యొక్క హక్కుసంబంధ తత్వచింతనపై ఒక విమర్శ (1844), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 72 నుండీ.
ప్రతి యుగంలోనూ పాలక వర్గం భావనలే పాలక భావనలుగా కూడ వుంటాయి, అంటే సమాజపు భౌతిక (పాదార్థిక) శక్తిని పాలించే వర్గమే, అదే సమయంలో, దాని (సమాజపు) మేధో (బౌద్ధిక) శక్తినికూడ పాలిస్తూంటుంది. పాదార్థిక (భౌతిక) ఉత్పత్తి సాధనాలు దేని అందుబాటులో వుంటాయో ఆ వర్గం అదే సమయంలో మానసిక ఉత్పత్తి సాధనాలపైకూడ అదుపాజ్ఞలు కలిగివుంటుంది; అందువల్ల, సాధారణంగా చెబితే, మానసికోత్పత్తి సాధనాలు లేని వాళ్ల భావనలు ఆ వర్గానికి అధీనమై వుంటాయి. పాలక భావనలంటే ఆధిపత్యంలోవుండే పాదార్థిక (భౌతిక) సంబంధాల భావాత్మక వ్యక్తీకరణ తప్ప మరేమీ కావు; అంటే భావనలుగా చిక్కించుకోబడే ఆధిపత్యంలోని భౌతిక సంబంధాలు అవన్నమాట. కనుక, అవి ఒక వర్గాన్ని పాలక వర్గంగా రూపొందించే సంబంధాల భావనాపర వ్యక్తీకరణలై వుంటాయి; అందుచేత అవి ఆ వర్గపు ఆధిపత్యానికి సంబంధించిన భావనలు అని చెప్పవచ్చు. పాలక వర్గాన్ని ఏర్పరిచే వ్యక్తులు మిగతా యితర విషయాలతోబాటు చైతన్యంకూడ కలిగివుంటారు; కనుక వాళ్లు ఆలోచిస్తుంటారు. అందుచేత, వాళ్లు ఒక వర్గంగా పరిపాలిస్తూ, ఒక యుగపు విస్తృతినీ, పరిథినీ నిర్ణయిస్తూండేంతమేరకు, వాళ్లు ఆ పనిని ఆ మొత్తం వరసవ్యాప్తిలో నిర్వర్తిస్తూంటారని, కనుక యితర అంశాలకు తోడుగా చింతకులుగా- భావ స్రష్టలుగా- కూడ పాలిస్తూంటారని, తమ యుగపు భావనల ఉత్పత్తి-పంపిణీల్ని క్రమబద్ధం చేస్తుంటారని, అందువల్ల వాళ్ల భావనలు ఆ యుగపు పాలక భావనలై వుంటాయనేది స్వయంస్పష్టంగానే వుంది. - జర్మన్‌ భావజాలం (1845-46), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 176.
మధ్య యుగాల్లో ప్రతి పట్టణంలోని పౌరులూ తమ [ధన మాన] ప్రాణ రక్షణకుగాను భూస్వామ్యకులీన ప్రభువర్గానికి వ్యతిరేకంగా ఐక్యం కావలిసి వచ్చేది. వర్తకవ్యాపారాల విస్తరణ, సమాచార సంబంధాల ఏర్పాటులతో వేర్వేరు [గా వుండిన] పట్టణాలు [తమ లాగే] ఒకే శత్రువుతో అవే పోరాటప్రయోజనాలు ఉద్ఘాటించి వున్న యితర పట్టణాలగురించి తెలుసుకోవడానికి దారి తీసింది [వీలు పడింది]. అనేక స్థానిక బర్గర్ల (పురవాసుల) సంఘాల [కార్పొరేషన్‌ల] నుండి ఒక బర్గర్ల వర్గం [బూర్జువా వర్గం] ఆవిర్భవించింది – కాని, అది చాల మెల్లమెల్లగా మాత్రమే. సమాజంలో అప్పట్లో ఉనికిలో వుండిన సంబంధాలు, వాటిచే నిర్ణయింపబడే ఉత్పత్తి విధానానికి ఈ బర్గర్లు విరుద్ధంగా వుండడంచేత, విడి విడి బర్గర్ల జీవన పరిస్థితులు [క్రమక్రమంగా] వాళ్లందరికీ ఉమ్మడిగావుంటూనే, అదే సమయంలో ప్రతి వ్యష్టి బర్గరుకూ స్వతంత్రంగావుండే [సామాన్య] పరిస్థితులుగా రూపొందాయి. ఆ [సామాన్య బర్గర్ల వర్గ] పరిస్థితుల్ని, తమంత తామే ఫ్యూడల్‌ బంధనాలనుండి తెగతెంపులు చేసుకుని స్వతంత్రమైన మేరకు స్వయంగా బర్గర్లే సృష్టించుకొన్నారు; అయితే, అప్పట్లో ఉనికిలోవున్న ఫ్యూడల్‌ వ్యవస్థకు వ్యతిరేకంగా వుండే వారి శత్రుత్వం వారి అస్తిత్వాన్ని నిర్దేశించినంత మేరకు ఆ పరిస్థితులే వాళ్లను [బర్గర్లను] సృష్టించాయని చెప్పుకోవాలి. విడి విడి పట్టణాలు సంఘాలు-సమాఖ్యలుగా ఏర్పడ్డం మొదలైన కొద్దీ, ఈ ఉమ్మడి [సామాన్య] పరిస్థితులు వర్గ పరిస్థితులుగా రూపొందాయి. ఒకే విధమైన పరిస్థితులు, ఒకే విధమైన వైరుధ్యం, ఒకే విధమైన ప్రయోజనాలు ప్రతిచోటా అనివార్యంగా [అవశ్యంగా] మొత్తంమీద ఒకేలా వుండే ఆచారవ్యవహారాలను ఆహ్వానించాయి. అసలుకు బూర్జువా వర్గమే, తన యిలాంటి పరిస్థితుల్లో, అతి క్రమక్రమేపీగా మాత్రమే, అభివృద్ధి చెందుతుంది; [మొదట్లోనైతే] శ్రమ విభజన ప్రకారం నానా ముఠాలుగా చీలిపోతూంటుంది; అంతిమంగా మనుగడలోవున్న [తనకు తటస్థించే] సకల ఆస్తిపర వర్గాలనూ, తనకు కనిపించిన ఆస్తులన్నీ పారిశ్రామిక లేక వాణిజ్య పెట్టుబడిగా పరివర్తన చెందే మోతాదులో, తనలోకి పీల్చివేసుకుంటుంది; [అదే సమయంలో అంతకుపూర్వపు ఆస్తిలేని వాళ్లలో మెజారిటీని, అలాగే యిదివరకటి ఆస్తిపర వర్గాలో కొంత భాగాన్ని ఒక కొత్త వర్గంగా – అధోకార్మిక వర్గంగా రూపొందిస్తుంది ఈ బూర్జువా వర్గం]. ఇంకో వర్గంతో ఉమ్మడి పోరాటం (యుద్ధం) చేయవల్సివచ్చేంతమేరకే విడి విడిగావుండే వ్యక్తులు ఒక వర్గంగా ఏర్పడివుంటారు; అలా లేనప్పుడు వాళ్లు పోటీదారులుగా పరస్పరం శత్రుస్థితిలో వుంటారు. కాగా, మరోవైపున, ఈ వర్గం దానివంతుకు విడి వ్యక్తులకు అతీతంగా, వ్యతిరేకంగాసైతం, ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని సంతరించుకొంటుంది. అందుమూలంగా ఈ విడి వ్యక్తులు తమ అస్తిత్వ పరిస్థితులు పూర్వభాగ్యనిర్ణీతమైనట్లు కనుగొంటారు. కనుక తమ జీవనస్థితీ, తమ వ్యక్తిగత వికాసమూ రెండూ వాళ్ల [తమ] వర్గంచే తమకు ప్రదానం చేయబడినట్లు కనుగొంటారు; తాము ఆ [తమ] వర్గంలో సంలీనం గావించబడుతారు. విడి వ్యక్తులు శ్రమ విభజనకు అధీనమౌతూండే పరిణామంలాంటిదే యిదికూడ. కనుక యిదికూడ ప్రైవేటు ఆస్తి రద్దుచేత, [పర్యవసానంగా సంభవించే] స్వయంగా శ్రమ రద్దు చేత మాత్రమే తొలగింపబడగలదు. పోతే యిలా వ్యక్తులు ఒక వర్గంలో సంలీనం చేయబడడం అనేది వాళ్లు నానా రకాల భావనలు, వగైరాకు అధీనం అయేట్లు ఎలా చేస్తుందో మనం యిప్పటికే అనేక సార్లు సూచించివున్నాము. - జర్మన్‌ భావజాలం (1845-46), పు. 69 నుండీ.
ఉత్పాదక శక్తుల అభివృద్ధిక్రమంలో అప్పటికి ఉనికిలోవుండే సంబంధాలలో కేవలం చెరుపును మాత్రమే కలగజేసే, మరెంత మాత్రం ఉత్పాదకంకాక కేవలం విధ్వంసకంగామట్టుకే వుండే ఉత్పాదక శక్తులు, పరస్పర సంబంధ సాధనాలు [యంత్రాలూ, డబ్బూ] అస్తిత్వంలోకి వచ్చే ఒక [క్లిష్ట] దశకూడ వస్తుంది. ఇక దీనికి సంబంధించి సమాజంలోని సానుకూలతల్ని వేటినీ ఆనందించ లేని, కాని సమాజపు బరువుబాధలన్నింటినీ భరించవల్సి వచ్చే ఒక వర్గం, సమాజంనుండి బహిష్కృతులై, యితర అన్ని వర్గాలతోనూ అత్యంత నిర్ణాయక శత్రుత్వం (వైరం) లోనికి బలవంతంగా నెట్టబడే ఒక వర్గం ఆవిర్భావం ఆవశ్యకమౌతుంది. సమాజసభ్యులందరిలో అత్యధిక సంఖ్యాకుల్ని (మెజారిటీని) కలిగి వుండే ఒక వర్గం, దేనినుండైతే ఒక మౌలిక విప్లవ ఆవశ్యకతను గురించి చైతన్యం, అంటే కమ్యూనిస్టు చైతన్యం ప్రసరిస్తుందో అలాంటి వర్గ ఆవిర్భావం ఆహ్వానింపబడుతుంది. అయితే, ఈ [మౌలిక విప్లవ ఆవశ్యకతా] కమ్యూనిస్టు చైతన్యం ఇతర వర్గాలలోకూడ, ఈ [అధోకార్మిక] వర్గం పరిస్థితిగురించి లోతైన యోచన [ధ్యానం] వల్ల, తలెత్తవచ్చనుకోండి. - జర్మన్‌ భావజాలం (1845-46), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 179.
వర్గాలమధ్య వైరాల పునాదిపై నెలకొన్న ప్రతి సమాజంలోనూ పీడిత (అణిచివేయబడ్డ) వర్గం ఒక కీలక షరాస్థితి అంశంగా వుంటుంది. అందువల్ల ఆ పీడిత వర్గం విమోచన అంటే ఒక నూతన సమాజం సృష్టి అనే అంతరార్థం అవశ్యంగా వస్తుంది. పీడిత వర్గం తన్నుతాను విముక్తి చేసుకోవాలంటే ఆవరకే సముపార్జించుకోబడ్డ ఉత్పాదక శక్తులు, అప్పటికి ఉనికిలోవున్న సాంఘిక సంబంధాలు ఒకదాని సరసన మరొకటి [అనుగుణంగా] మనలేని పరిస్థితి ఆవశ్యకమౌతుంది. అన్ని ఉత్పత్తి పరికరాల్లోకీ విప్లవకర వర్గమే స్వయంగా అత్యంత మహత్తర ఉత్పాదక శక్తి [వంతం] గా వుంటుంది. విప్లవకర మూలకాంశాలు ఒక వర్గంగా సంఘటితం అయ్యాయంటే [లేక అలా కావాలంటే] అప్పటికే పాత సమాజం వక్షంలో అంకురించ గల ఉత్పాదక శక్తులన్నీ మనివుండివుంటాయని ఊహించవచ్చు [లేక అలా మనివుంటేనే అది సాధ్యం అనే అర్థంకూడ రావచ్చు].
మరి దీనర్థం పాత సమాజపు పతనం తర్వాత ఒక కొత్త రాజకీయాధికారం తీసుకొచ్చే ఒక కొత్త వర్గాధిపత్యం వస్తుందనా? [కానే] కాదు.
కార్మిక వర్గ విమోచనకు [వలసిన] షరాస్థితి ప్రతి వర్గమూ రద్దు కావాల్సిన [లేక రద్దు చేయబడాల్సిన] స్థితే. ఎలాగైతే [అంతకు పూర్వం] అన్ని యిస్తువగణాలూ (ఎస్టేట్లు), అన్ని అంతస్తులూ (ఆర్డర్లు) రద్దు కావడమనేది బూర్జువా అంతస్తుకు సంబంధించిన మూడవ యిస్తువగణం (థర్డ్‌ ఎస్టేట్‌) యొక్క విమోచనకు వలసిన షరాస్థితిగా వుండిందో, ఇదీ అలాగే.
కార్మిక వర్గం, తన అభివృద్ధి క్రమంలో, పాత పౌర సమాజంస్థానే వర్గాలు, వాటి మధ్యలి వైరాలు లేని ఒక సంఘాన్ని తెచ్చిపెడుతుంది; అప్పుడు రాజకీయాధికారం అని సముచితంగా పిలవబడేదేదైతే వుంటుందో అదికూడ మరెంతమాత్రం ఉనికిలో వుండదు – ఎందుకంటే, ఖచ్చితంగా చెబితే రాజకీయాధికారం అంటే పౌర సమాజంలోని వైరాలకు ఒక అధికారిక వ్యక్తీకరణే గదా.
ఈ మధ్యలో అధోకార్మిక వర్గానికీ, బూర్జువావర్గానికీ మధ్య వుండే వైరం వర్గానికి వ్యతిరేకంగా వర్గం జరిపే పోరాటంగా [అంటే వర్గం అనేదాన్నే రూపుమాపేందుకు వర్గ పోరాటంగా] సాగుతుంది; ఈ పోరాటం ఒక సంపూర్ణ విప్లవంలో దాని అత్యున్నత దశకు [శిఖరాగ్రానికి] చేరుకుంటుంది. అయినా నిజానికి వర్గాల నడుమ విరోధం ప్రాతిపదికన నెలకొన్న ఒక సమాజం చివరకు ఒక పాశవిక వైరుధ్యంలో, కాయానికి వ్యతిరేకంగా కాయం సమర్పించే అదురుదెబ్బగా, తన అంతిమ పరాకాష్టాపరిష్కారం (dénouement) పొందడానికి పయనించడంలో ఆశ్చర్యమేమున్నది?
సాంఘిక వుద్యమం అంటే రాజకీయ వుద్యమం వుండనిది అని అనకు. ఏకకాలంలో సాంఘికంకూడ అయివుండని రాజకీయ వుద్యమం అనేదే ఏదీ వుండదు [అని తెలుసుకో]. [లేదా ప్రతి రాజకీయ వుద్యమమూ అదే సమయంలో సాంఘిక వుద్యమంకూడ అయి వుంటుందని తెలుసుకో.]
వర్గాలూ, వర్గ వైరాలూ మరెంతమాత్రం వుండనటువంటి స్థితిగతుల్లోమాత్రమే [అలాంటి పరిస్థితుల వ్యవస్థలోమాత్రమే] సాంఘిక క్రమపరిణామాలు, రాజకీయ విప్లవాలుగా వుండడం మానుతాయి (social evolutions will cease to be political revolutions). అంతదాకా, సమాజపు ప్రతి సాధారణ పునర్వ్యవస్థీకరణకు పూర్వ సంధ్యలోనూ, సమాజవిజ్ఞానశాస్త్రపు తుదిపలుకు యిదే కాగలదు:
Le combat ou la mort; la lutte sanguinaire ou le néant.C’est ainsi que la question est invinciblement posée.
యుద్ధమో, మరణమో; రక్తదాహ పోరాటమో, అంతిమ శాంతమో; ఇలా వుంటుంది అజేయ పోరాట [యోధుల?] సమస్యంతా!
[ఒక్క మాటలో ' విజయమో, వీరస్వర్గమో! ' అనొచ్చా? – అను.]
- తత్వశాస్త్ర దారిద్ర్యం (1847), పుటలు 214 నుండీ.
ఇంతవరకు నడిచిన చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రే.
స్వతంత్రుడూ, బానిసా; కులీనుడూ (patrician), అలగాజనుడూ (plebeian); ప్రభువూ, అర్ధ బానిసా; వృత్తిసంఘ యజమానీ (guild-master), వృత్తిశ్రామికుడూ (journeyman); ఒక్కమాటలో చెబితే, పీడకులూ, పీడితులూ ఎల్లప్పుడూ పరస్పర వైరుధ్యాలతో ఒక్కో సారి ప్రచ్ఛన్నంగానూ, ఒక్కో సారి బాహాటంగానూ మొత్తంమీద ఎడతెగని పోరాటం కొనసాగించారు. చివరకి ఈ పోరాటం ప్రతి సారీ యావత్‌ సమాజపు విప్లవాత్మక పునర్వ్యవస్థీకరణకుగానీ, లేదా సంఘర్షించే వర్గాల ఉమ్మడి వినాశానికిగానీ దారితీసింది.
తొలి చారిత్రక యుగాల్లో మనకు దాదాపు ప్రతి చోటా సమాజం వివిధ శ్రేణుల్లో సంక్లిష్టంగా వ్యవస్థీకృతమై వుండడం, సాంఘిక హోదాల్లో బహుళ తరగతులుండడం గోచరిస్తుంది. పురాతన రోమ్‌లో మనకు కులీనులూ, వీరయోధులూ (Knights), అలగాజనులూ, బానిసలూ కనిపిస్తారు; మధ్యయుగాల్లో మనకు ఫ్యూడల్‌ ప్రభువులూ, ప్రభుదాసులూ (లేక పాళెగాళ్లు - vassals), వృత్తిసంఘ యజమానులూ, వృత్తిశ్రామికులూ, అప్రెంటిసులూ (పనినేర్చుకొనే వాళ్లు, ఉమేజువారు), అర్ధబానిసలూ అగుపిస్తారు. దాదాపు ఈ తరగతులన్నిటిలోనూ మనకు మళ్లీ కింది తరగతులు కనిపిస్తాయి.
ఫ్యూడల్‌ సమాజ శిథిలాలనుండి అంకురించిన ఆధునిక బూర్జువా సమాజం వర్గ వైరాలను రూపుమాప లేదు. పాతవాటి స్థానే కొత్త వర్గాలనూ, కొత్త దోపిడీ, అణచివేతల పరిస్థితుల్నీ, కొత్త పోరాట రూపాలనూ ప్రవేశపెట్టడమే అది చేసిన పని.
అయితే బూర్జువా యుగమైన మన యుగానికి ఈ ఒక విశిష్ట లక్షణం వుంది: అది వర్గ వైరాలను సులభతరం గావించింది. రెండు మహా శత్రు శిబిరాలుగా, నేరుగా ఒకదాన్నొకటి ఎదుర్కొనే రెండు మహా వర్గాలుగా – బూర్జువా వర్గం, అధోకార్మిక వర్గాలుగా సమాజం యావత్తూ అంతకంతకూ అధికంగా చీలిపోతున్నది.
- కమ్యూనిస్టు ప్రణాళిక (1848), కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 222.

కార్మికులు ఒక వర్గంగా, తద్వారా ఒక రాజకీయ పక్షంగా రూపొందే వ్యవస్థీకరణను తిరిగి కార్మికులమధ్యే చెలరేగుతూండే పోటీయే సదా తలకిందులు గావించివేస్తూంటుంది. అయినా ఈ కార్మికుల నిర్మాణం ఎల్లప్పుడూ మరింత సుదృఢంగా, శక్తివంతంగా, బలవత్తరంగా మళ్లీ మళ్లీ తలయెత్తుతూంటుంది. బూర్జువా వర్గంలోనే వుండే చీలికల్ని ఉపయోగించుకొని అది [కార్మికుల వ్యవస్థీకరణ] కార్మికుల నిర్దిష్ట ప్రయోజనాలకు శాసనపరమైన గుర్తింపు లభించేలా వత్తిడి తెస్తుంది. పది గంటల బిల్లు ఇంగ్లండులో ఆమోదించబడింది ఈ విధంగానే.
మొత్తంమీద చూస్తే (Altogether) పాత సమాజంలోని వర్గాల మధ్యని ఘర్షణలు అధోకార్మిక వర్గ వికాసాన్ని అనేక విధాలుగా పెంపొందిస్తాయి. మొదట ప్రభుస్వామ్యంతోనూ, ఆనక పరిశ్రమల అభివృద్ధికి విరుద్ధమైన ప్రయోజనాలు గల ఆ యా బూర్జువా వర్గ తరగతులతోనూ, అన్నివేళలా విదేశీ బూర్జువా వర్గాలతోనూ బూర్జువా వర్గం నిరంతరం యుద్ధం చేస్తూనే వుంటుంది. ఈ యుద్ధాలన్నింటిలోనూకూడ అది అధోకార్మిక వర్గానికి వినతి చేసుకోవాల్సిన, దాని సహాయాన్ని అర్థించవల్సిన స్థితికి నెట్ట బడుతుంది. ఈ విధంగా కార్మిక వర్గాన్ని రాజకీయ రంగస్థలంపైకి లాగుకురావాల్సిన అనివార్య అవసరం దానికి కలుగుతుంది. కనుక స్వయానా బూర్జువా వర్గమే అధోకార్మిక వర్గానికి తన సొంత రాజకీయ పరిజ్ఞానం, సాధారణ విద్యలకు సంబంధించిన అంశాలను సరఫరా చేస్తూంటుంది; అంటే, మరోలా చెబితే, స్వయంగా తనతో (అంటే బూర్జువా వర్గంతో) పోరాడేందుకు వలసిన ఆయుధాలను అది అధోకార్మిక వర్గానికి తానుగానే అందిస్తుంది.
ఇంకా, పరిశ్రమల పురోగమనంతో పాలక వర్గాలకు చెందిన కొన్ని తరగతులు మొత్తంగానే అధోకార్మిక వర్గ స్థాయికి కుంగిపోతాయనీ, లేక కనీసం ఆ తరగతుల అస్తిత్వ పరిస్థితులకే ముప్పు వాటిల్లుతుందనీ మనం ఈ వరకే గమనించాము. మరి ఈ తరగతులుకూడ జ్ఞానబోధ, ప్రగతి-అభ్యుదయాలకు సంబంధించిన తాజా అంశాలను అధోకార్మిక వర్గానికి సరఫరా చేస్తాయి.
చివరగా, వర్గ పోరాటం ఒక నిర్ణయాత్మక దశకు చేరుకున్నప్పుడు, పాలక వర్గంలోనూ, యథార్థానికి పాత సమాజమంతటిలోనూ సాగే విచ్ఛిత్తి క్రమం ఎంతగా ప్రస్ఫుటమైన, ఎంతగా హింసాపూరితమైన రూపం దాలుస్తుందంటే, పాలక వర్గంలో ఒక చిన్న భాగం తన వర్గంతో పూర్తి తెగతెంపులు చేసుకొని విప్లవకర వర్గంతో – అంటే భవిష్యత్తును తన గుప్పిట్లో యిరికించుకుని వుండే వర్గంతో చేతులు కలుపుతుంది. కనుక అంతకు క్రితం ప్రభువర్గంలో ఒక భాగం ఎలాగైతే బూర్జువా వర్గం వైపుకు వెళ్లిపోయిందో, సరిగ్గ అలాగే యిప్పుడు బూర్జువా వర్గంలో ఒక భాగం అధోకార్మిక వర్గం [వైపుకు మళ్లి దాని శ్రేణుల్లో చేరి] పోతుంది. ప్రత్యేకించి, చారిత్రక వుద్యమాన్ని మొత్తంగానూ, సైద్ధాంతికంగానూ అవగాహన చేసుకొనే స్థాయికి ఎదిగిన బూర్జువా సిద్ధాంతవేత్తల్లో ఒక భాగం అధోకార్మిక వర్గం వైపుకు వెళ్లిపోతుంది. [బూర్జువా వర్గానికి ఎదురుబొదురుగా నిల్చుని వున్న వర్గాలన్నిటిలోకీ ఒక్క అధోకార్మిక వర్గంమట్టుకే నిజంగా విప్లవకరమైన వర్గం. ఇతర వర్గాలన్నీ ఆధునిక పరిశ్రమ పురోగమనంతో క్షీణించి, క్షీణించి తుదకు అంతరించి (అదృశ్యమై) పోతాయి. కాగా అధోకార్మికవర్గం (మాత్రం) ఆధునిక పరిశ్రమయొక్క ప్రత్యేకమైన, ప్రధానమైన ఉత్పత్తిఫలంగా (నిలిచి) వుంటుంది.] - కమ్యూనిస్టు ప్రణాళిక, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 228 నుండీ.

వర్గం

వర్గం - 1

వర్గం
వ్యాఖ్యానం
చరిత్రనుగురించిన మార్క్స్ దృక్పథంలో వర్గాలకు అపార ప్రాధాన్యం వున్నదనేది స్పష్టమే. "ఇంతదాకా వుంటూవచ్చిన సమాజాల చరిత్ర [అంతా] వర్గ పోరాటాల చరిత్రే," అనే పదగుంభనంతో ప్రారంభమౌతుంది [మార్క్స్‌ రాసిన] కమ్యూనిస్టు ప్రణాళిక. మార్క్స్‌ ప్రకారం వర్గాలు సమాజంలోని ప్రాథమిక సాంఘిక బృందాలు, వాటి (ఆ ప్రాథమిక సాంఘిక బృందాల) మధ్య ఘర్షణ ద్వారానే సమాజం, దాని ఆర్థిక ఉపకట్టడంలోని మార్పులకు అనుగుణంగా, వికసిస్తూ వచ్చిందని. ఏదైనా ఒక వర్గం దాని సొంత ప్రయోజనాల్ని మొత్తం సమాజపు ప్రయోజనాలతో మమేకంగా గుర్తించగలిగినప్పుడు విప్లవాలు సంభవిస్తూ వచ్చాయని యిదివరలో (గతంలో) మార్క్స్‌ భావించాడు. జర్మన్‌ భావజాలం లో మార్క్స్‌ యిలా అంటాడు: "ఇదివరకటి పాలకవర్గం స్థానే [అధికారంలోకి] వచ్చే ప్రతి కొత్త వర్గమూ, కేవలం తన లక్ష్యాలను సాధించడానికి గాను, తన సొంత ప్రయోజనాన్ని సమాజసభ్యులందరి ఉమ్మడి ప్రయోజనంగా చిత్రించి చూపాల్సి వస్తుంది… కనుక, విప్లవం తెచ్చే వర్గం మొదటి నుండీకూడ … ఒక వర్గంలా కాక మొత్తం సమాజపు ప్రతినిధిలా అగుపిస్తూంటుంది."[1] మరి ఈ 'గుర్తింపులు' (మమేకతాప్రదర్శనలు - identifications) గతంలో అతి స్వల్పకాలాలపాటే మనివుంటూండి నట్లు రుజువయిందికూడ; కాని [ఇప్పుడు] రానున్న విప్లవంలో మట్టుకు అధోకార్మిక వర్గం – వర్గవ్యవస్థ మరింత సులభసామాన్యం కావడం వల్లా, అలాగే కేవలం దాని సంఖ్యాబాహుళ్యంవల్లకూడ – మొత్తం సమాజపు ప్రయోజనాలకూ ప్రాతినిధ్యం వహించగలిగే స్థితిలో నిజంగా వుంది. అందుచేత ఈ సారి వచ్చే విప్లవం, కాలక్రమాన ఒక వర్గరహిత సమాజాన్ని ఆవిష్కరిస్తుంది. రాజ్యం, పరాయీకరణలలాగే వర్గంకూడ ఒక తాత్కాలిక పరిణామం (అస్తిత్వం) గా వుంటుంది; పెట్టుబడిదారీ సమాజంలో అది దాని పూర్ణ విస్తృతిలో [చిత్రించబడి] వుంటుంది.
మార్క్స్‌కు సంబంధించి వర్గంగురించిన భావనకు ఎంత ప్రాముఖ్యం వుందో గమనిస్తే, మరి ఆ భావనగురించి ఆయన ఒక క్రమబద్ధ విశ్లేషణ ఏమీ చేయలేదంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. కనీసం యిలాంటి విశ్లేషణకు ఆయన పూనుకొన్నదైనా ఒకే ఒక చోట – పెట్టుబడి గ్రంథం 3 వ సంపుటం చివరన మాత్రమే – అదీ అసంపూర్ణంగానే; ఆయన మరణంతో అది అర్ధంతరంగా ఆగి పోయిందికూడ.[2] 'ఎన్ని వర్గాలు వున్నాయి?' అనే ప్రశ్నతో [అక్కడి] ఆ రచనాభాగాన్ని మొదలు పెడతాడు మార్క్స్‌. మళ్ళీ తానే పెట్టుబడిదారీ సమాజంలో మూడు పెద్ద వర్గాలు – వేతన శ్రామికులు, పెట్టుబడిదారులు, భూయజమానులు – వున్నారని జవాబిస్తాడు. అయితే వెంటనే దానికి సవరణగా, పెట్టుబడిదారీ సమాజం అత్యంత వికసితరూపంలోవున్న ఇంగ్లండులో, "ఈ వర్గాల పొరవిభజన అంత శుద్ధ రూపంలో ఏమీ కనిపించదు. ఇక్కడ సైతం మధ్యతరగతులు, నడిమిబృందాల పొరలు ప్రతి చోటా ఈ హద్దు నిర్దేశాన్ని చెరిపివేస్తూంటాయి (అయితే ఇలాంటి చెరిపివేత పట్టణాల్లోనే హెచ్చుగా వుంటుంది; గ్రామీణప్రాంతాల్లో యిది చాల – పోల్చలేనంత – తక్కువగానే వుంటుంది), " అని చేర్చిచెబుతాడుకూడ. అయితే, పెట్టుబడిదారీ సమాజ వికాసంతో రెండంటే రెండే వర్గాలు – బూర్జువా వర్గం, అధోకార్మికవర్గాలు సృష్టి అవుతూండడంతో పరిస్థితి వేవేగంగా సులభతరం అవుతున్నది. 'మధ్య తరగతులు, నడిమి బృందాల' పొరలు పిప్పిగావించబడి పారవేయబడడమే కాదు, భూయజమానులుసైతం యిదేవిధమైన క్రమానికి గురవుతారు. కాలక్రమాన కార్మికులందరూ వేతన-శ్రామికులుగా రూపొందుతారు; పెట్టుబడిదారులమధ్య పోటీమూలంగా కొంతమంది పెట్టుబడు దారుల సిరిసంపదలు పెరిగిపోగా, యితర పెట్టుబడిదారులు [దెబ్బ తిని] అధోకార్మికవర్గ శ్రేణులకు బలవంతంగా నెట్టివేయబడుతారు.

ఆ పై మార్క్స్‌ ఇంకో (రెండో) ప్రశ్న వేస్తాడు [లేక 'వేసుకుంటాడు' అనడం మెరుగేమో] : పైన ప్రస్తావించిన మూడు బృందాలనూ మూడు మహా సాంఘిక వర్గాలుగా రూపొందించే దేమిటి? దానికి మళ్లీ తానే – "మొదటి చూపుకైతే, వాటి ఆదాయాల గుర్తింపు, ఆ ఆదాయాల వనరులు [వాటిని మహా సాంఘిక వర్గాలుగా రూపొందించేది] అని చెప్పవచ్చు. మూడు మహా సాంఘిక బృందాలు వున్నాయి – వాటి సభ్యులు అంటే వాటిని రూపొందించే వ్యక్తులు [వరుస క్రమంలో] తమ వేతన-శ్రమనూ, తమ పెట్టుబడినీ, తమ భూఆస్తినీ వెచ్చించి [అందుమూలంగా వచ్చే] జీతాలు [వేతనాలు], లాభం, నేల కిరాయి [ground rent-కౌలుమొత్తం]లద్వారా జీవితాలు గడుపుతూ వుంటారనీ చెప్పవచ్చు" – అంటూ జవాబిస్తాడు. ఆ తర్వాత మార్క్స్‌ తానే యింకో ఆక్షేపణ చేస్తాడు – మరి ఈ ప్రమాణం ప్రకారమైతే, యితరులుకూడ, ఉదాహరణకు డాక్టర్లు, ప్రభుత్వోద్యోగులు వగైరా వేర్వేరు [ప్రత్యేక] వర్గాలవుతారే అని ప్రశ్నిస్తాడు. కాని అక్కడికి ఆ రాతప్రతి తెగిపోయివుండడం వల్ల ఈ అభ్యంతరానికి తన జవాబేమిటో మనకు బోధపడదు. అయితే పెట్టుబడిలో మార్క్స్‌ యిలా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి తన యితర రచనల్లో వర్గం గురించి ఆయన చేసిన అంత హెచ్చుగా క్రమబద్ధంకాని ప్రకటనలు మనకు దోహద పడుతాయి. [ఉదాహరణకు అంతకు ఎంతోకాలం పూర్వమే రాసిన] కమ్యూనిస్టు ప్రణాళిక లో మార్క్స్‌ రెండు వర్గాల నమూనాను వాడుతాడు: " సమాజం మొత్తమూ మరింత మరింతగా రెండు గొప్ప శత్రు శిబిరాలుగా, ఒకదానికొకటి నేరుగా ఎదురునిలిచే రెండు మహా వర్గాలుగా, బూర్జువా వర్గం - కార్మిక వర్గాలుగా చీలిపోతూంది,"[3] అంటాడు. బూర్జువా వర్గం అంటే ఉత్పత్తి సాధనాల యజమానులు, వేతన శ్రమ నియామకులూననీ, పోతే తమ సొంత ఉత్పత్తి సాధనాలంటూ ఏమీ లేని, తమ వేతన శ్రమను అమ్ముకుని బతికే వాళ్లు అధోకార్మిక వర్గమనీ [మార్క్స్‌] నిర్వచిస్తాడు. ఈ విధంగా వ్యాప్తిలోవున్న ఉత్పత్తి విధానంలో ఒక వ్యక్తికి వుండే స్థితే అతడు ఏదైనా వర్గానికి చెందేందుకు అర్హతాప్రమాణంగా చూడబడింది.
అధోకార్మిక వర్గపు దరిద్రీకరణ (immiserisation of the proletariat) గురించిన మార్క్స్‌ భావన వెనుకవుండేదికూడ ఈ రెండు-వర్గాల నమూనాయే నని మనం గమనించగలం. [అయితే మనమిక్కడ గమనించాల్సిందేమంటే,] అధోకార్మిక వర్గం ఏదో పరమరూఢ అర్థంలో [నిరపేక్ష రూపంలో] దరిద్రీకరణకు లోనవుతుందని మార్క్స్‌ ఎప్పుడూ అనలేదు.[4] అసలు ఇలాంటి ఆలోచనే, మానవావసరాలు అన్నీ సమాజ మధ్యవర్తిత్వంద్వారానే సాగిపోతాయని ఆయనకున్న నిశ్చితాభిప్రాయానికి బొత్తిగా నప్పేది కాదు. ఆయన వాదనంతా ఉత్పత్తి సాధనాల యజమానులకూ, అవి లేనివారికీ (కార్మికులకూ) నడుమ వుండే వనరుల అంతరం మరింత [మరింత] గా విస్తృతం అవుతుందని మాత్రమే. మార్క్స్‌ తన వేతన శ్రమ - పెట్టుబడి లో ఇంటికీ, రాజభవంతికీ నడుమ తేడాగురించి ఒక పిట్టకథ చెబుతూ ఈ విషయాన్ని తేటతెల్లం గావిస్తాడు:
ఇల్లు చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు. దాని చుట్టుపక్కలి ఇళ్లన్నీ అంతే చిన్నగా వుండేంతవరకూ అది ఒక నివాసగృహానికి చెందిన అన్ని సామాజిక డిమాండ్లనూ సంతృప్తి పరుస్తూంటుంది. అయితే ఆ చిన్న ఇంటిపక్కన ఒక రాజప్రాసాదం ఆవిర్భవించ నివ్వండి, అది [వెంటనే] చిన్న ఇల్లుగా వుండేబదులు ఒక గుడిసెగా కుంచించుకుపోయినట్లనిపిస్తుంది. ఇప్పుడు తన (చిన్న ఇంటి) యజమానికి చేయడానికంటూ డిమాండ్లు ఏమీ లేవని లేక చాల స్వల్పమైన డిమాండ్లు మాత్రమే వున్నాయని ఆ చిన్న ఇల్లు చూపిస్తుంది. నాగరికతా (వికాస) క్రమంలో ఆ చిన్న ఇల్లు ఎంత ఎత్తుగా పైకి ఎదిగినా మరి దాని పక్కనున్న రాజప్రాసాదం అంతే ఉధృతితో లేక మరింత విస్తృతంగా పెరిగిపోతే గనుక ఆ చిన్న ఇంటి నివాసి మరింత మరింతగా అసౌకర్యవంతంగా, అసంతృప్తిగా, తన ఇంటి నాలుగు గోడలనడుమ అంతకంతకూ ఎక్కువగా బిగుసుకు పోయినట్లుగా అనుభూతి చెందుతాడు.[5]
అయితే మార్క్స్‌ ఈ ' వర్గం' అనే పదాన్ని ఉపయోగించేది కేవలం ఒక్క ఈ రెండు వర్గాల నమూనా సందర్భంలోనే కాదు. ఇతర ఆర్థిక బృందాలకు, ప్రత్యేకించి పెటీబూర్జువా, రైతాంగ వర్గాలకు సంబంధించి కూడ ఆయన ఈ పదాన్ని వాడుతాడు. కమ్యూనిస్టు ప్రణాళిక లోని సుబ్బరమైన విభజనను ఈ రెండు బృందాలూ వర్తింప జేయకుండా అడ్డుకునేట్లగుపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు బృందాలూ తాము ఎంతమంది కార్మికుల్ని నియమిస్తాయి, లేక తాము ఎంత భూమికి యాజమాన్యం వహిస్తాయి అనేదాన్ని బట్టి ఇటు బూర్జువా వర్గంలోకో లేక అటు అధోకార్మిక వర్గంతోనో విలీనమై పోతాయనేది స్పష్టమేకాబట్టి. అంతేగాక, యంత్రాల ఇతోధిక వినియోగంతో బాటుగా సేవారంగ పరిశ్రమలు బహుళాభివృద్ధి చెందడంతో ఒక కొత్త మధ్య తరగతి ఆవిర్భవించగలదని మార్క్స్‌ ముందుచూపుతో చెప్తాడు కూడ. మార్క్స్‌ ఇంకా " ఒకవైపున కార్మికునికీ, మరోవైపున పెట్టుబడిదారు, భూస్వాము (భూయజమాను) లకూ నడుమ సంఖ్యాపరంగా నిరంతరం పెరిగిపోతూండే మధ్యతరగతి వర్గాలను" విస్మరిస్తున్నాడంటూ రికార్డోను విమర్శిస్తాడుకూడ.[6]
ఇంకా మరింత మధ్యంతరంగా వుండే యితర బృందాలూ [కొన్ని] వున్నాయి: ఉదాహరణకు వ్యవసాయ కూలీలనే తీసుకొంటే వాళ్లు రైతులకూ, అధోకార్మికులకూ మధ్య సగం-దారిలో వున్నట్లు కనిపిస్తారు. అధోకార్మిక వర్గంగురించిన మార్క్స్‌ సాధారణ స్వభావ చిత్రణ ప్రకారం అది (ఆ పదం) కేవలం పారిశ్రామిక కార్మికులకే వర్తించినా, కొన్నిసార్లు ఆయన అధోకార్మికవర్గం పెట్టుబడిదారీ సమాజంలో అపార మెజారిటీ ప్రజల్ని కలిగివుంటుంది, కనుక వ్యవసాయ కూలీల్నిసైతం అందులో చేర్చాల్సివుంటుందనికూడ అంటాడు. 1875లో బకూనిన్‌పై చేసిన ఒక వ్యాఖ్యక్రమంలో మార్క్స్‌, "పెట్టుబడిదారీ కౌలుదారు వచ్చి రైతుల్ని వెళ్లగొట్టే (బేదఖల్‌ చేసే), అందువల్ల నిజంగా భూమి దున్నే వ్యక్తికూడ పట్టణ కార్మికుడికిలాగే ఒక వేతన శ్రామికునిగా, అంతే అధోకార్మికునిగా మారిపోయే, ఆ విధంగా అతడితోబాటు అవే [అధోకార్మికవర్గ] ప్రయోజనాలు పాలు పుచ్చుకునే"[7] పరిస్థితి తలయెత్తే అవకాశం (సంభావ్యత) గురించి ప్రస్తావిస్తాడుకూడ. అదే వ్యాఖ్యక్రమంలో, భూయజమాని అయిన రైతుకూడ కొన్నిసార్లు, తనకు తెలియకుండానే, అధోకార్మిక వర్గానికి చెందే పరిస్థితులు వుంటాయనీ, అలాంటి రైతుయొక్క భూమిపై వుండే తనఖా (తాకట్టు) భారం, అతడు దానికి నిజమైన యజమాని కాడు, మరెవరికోసమో పని చేస్తున్నాడని స్పష్టం చేస్తుందనీ అంటాడు మార్క్స్‌. మరలాంటప్పుడు – రైతులు అధోకార్మికులుగా, భూయజమానులు పెట్టుబడిదారులుగా పరిగణించబడేటప్పుడు – మనకు మళ్లీ ఒక రెండు వర్గాల నమూనా ప్రత్యక్షమౌతుంది. అయినప్పటికీ [అదలావున్నా] రైతులు రాజకీయంగా ఒక అభివృద్ధి నిరోధక వర్గమనే భావిస్తాడు; కనుక వారిని పట్టణ అధోకార్మిక వర్గంతోబాటు జట్టుకలపడానికి సుముఖత చూపడు మార్క్స్. [ఎందుకంటే] పశ్చిమ యూరపులో [అప్పటికి] అత్యంత తాజా రైతు వుద్యమాలు ఫ్యూడల్‌ [భూస్వామ్య] లేక రాచరిక మొగ్గుధోరణులతో నిండివుండినాయి [గనుక].
పోతే, మార్క్స్‌కు వర్గీకరించడానికి కష్టంగా తోచిన రెండో మధ్యంతర బృందం – తానుసైతం దేనికి చెందివున్నాడో ఆ బృందం, మేధావి (లేక బుద్ధిజీవి) వర్గం. ఆయన తరచూ వాళ్లనుగురించి బూర్జువా వర్గపు 'భావజాలపర (లేక సైద్ధాంతిక) ప్రతినిధులు, మాటకర్తలు (spokesmen)' అని ప్రస్తావిస్తూండేవాడు. అలాగే, "తామొక వర్గమనే భ్రమను సర్వసమగ్రీకరించడమే తమ జీవికకు ప్రధానవనరు గావించుకునే" బృందం వీరని ఎత్తిపొడుస్తాడుకూడ.[8] ఇంకా, కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే ఈ మేధావులు బూర్జువా వర్గపు 'కూలి మనుషులు (వేతన శ్రామికులు)' గా, కాని అధోకార్మికులు వేతనశ్రామికులైన అర్థంలోకాక అందుకు స్పష్టంగా భిన్నమైన అర్థంలో అలా వుంటారని అంటాడు మార్క్స్‌. అయితే అదే సమయంలో తమ వర్గ నేపథ్యాలు ఏమైనా, కొంతమంది మేధావులైతే సమాజానికి సంబంధించిన కనీసం కొన్ని విషయాలకు సంబంధించైనా (లేక కోణాలగురించైనా) వస్తుగత మదింపుకు (objective assessment – ఒక విధమైన నిష్పాక్షిక భౌతిక అంచనాకు) రాగలిగారనికూడ గుర్తించకపోలేదాయన. ప్రత్యేకించి, రికార్డోలాంటి ప్రామాణిక (లేక సాంప్రదాయిక - classical) అర్థశాస్త్రజ్ఞులు లేదా బ్రిటిషు ఫాక్టరీ ఇన్‌స్పెక్టర్లలాంటివాళ్లు యిలాంటి భౌతికపరిశీలనా దృక్పథం కలిగివుండినారని పేర్కొంటాడు కూడ.
మేధావులు (బుద్ధిజీవులు) ' భావజాలపర వర్గాలు' అంటూ మార్క్స్‌ అతి తరచూ ప్రస్తావించడం గమనిస్తే, ఆయన కొన్ని సార్లు ఆ పదాన్ని ఏదైనా ఒక బృందానికి ఉత్పత్తి విధానంలో వుండే స్థితితో నిమిత్తం లేకుండా వాడాడని స్పష్టమౌతుంది. ఉదాహరణకు, 'చిన్న వర్తకవ్యాపారులు, దుకాణదారులు, చేతివృత్తిదారులు, రైతుల' తో కూడుకున్న ఒక ' దిగువ మధ్యతరగతి వర్గం' గురించికూడ మార్క్స్‌ [ఒక చోట] ప్రస్తావించివున్నాడు.[9] అలాగే బ్రిటన్‌లోని 'పాలక వర్గాల' నుగురించి కూడ మాట్లాడడమేగాక, విత్త పెట్టుబడి దారులు, పారిశ్రామిక పెట్టుబడిదారులు "రెండు స్పష్టంగా వేరైన వర్గాలు" అని చెప్పేంతదాకాకూడ వెళ్తాడు మార్క్స్‌. ఇక సాంఘిక కొలబద్ద మరో కొసన అలగా కార్మిక వర్గం అని మార్క్స్‌ పేర్కొన్న వర్గం వుంది. మార్క్స్‌ తన ఫ్రాన్స్‌లో వర్గ పోరాటాలు లో, "అన్ని రకాల దొంగలు, నేరస్తులను కొత్తగాచేర్చుకొనే (భర్తీ చేసుకొనే – రిక్రూటు చేసుకొనే) వనరుగా వుండేవాళ్లు, సమాజం పారేసే [ఎంగిలి] తునకలు తిని బతికే, ఒక నిశ్చితమైన వృత్తి అంటూ లేనివాళ్లు, తిరుగుబోతులు, కుదురుగా ఒక ఇల్లూ సంసారమంటూ లేనివాళ్లు"[10] ఈ అలగా కార్మికవర్గమని వర్ణించి చెబుతాడు. వేరే మాటల్లో (మరో విధంగా) చెబితే, ఈ అలగాకార్మిక వర్గం సమాజంనుండి తప్పుకుతిరిగే వాళ్లు (dropouts of society), సమాజాభివృద్ధిలో ప్రయోజనం, ఆసక్తి అంటూ లేనివాళ్లు, కనుక నిర్వర్తించడానికి చారిత్రక పాత్ర ఏదీ లేని వాళ్లన్న మాట. వాళ్లు తమ సేవలు బూర్జువావర్గానికి అమ్ముకొనడానికి సుముఖంగా వుంటారుగనుక అప్పుడప్పుడూ వాళ్లు అభివృద్ధినిరోధకులుగా అయివుండవచ్చుకూడ.
ఈ విధంగా వర్గానికి మార్క్స్‌ యిచ్చే నిర్వచనం, ఆయన ఆలోచనల వికాసక్రమంతోబాటేగాక ఒకే [ఆలోచనాస్థాయి] కాలంలోకూడ ఎంతో హెచ్చుగా మారిపోతూండడం గమనిస్తాము. తన కాలపు వాడుకకు అనుగుణంగా మార్క్స్‌ ఈ [వర్గం అనే] పదాన్ని తరచూ ఒక ముఠా లేక బృందం అనే అర్థంలోకూడ ఉపయోగించాడు.
అయినప్పటికీ రెండు సాధారణ అంశాలు ఎత్తిచూపవచ్చు: మొదటగా, సమాజాన్ని పెట్టిబడిదారులు, అధోకార్మికవర్గం, భూయజమానులు అనే [వర్గాలుగా] త్రిపక్షీయ విభజన గావించడం మనకు మార్క్స్‌ [రచనల్లో] అతి సాధారణంగా కనిపిస్తుంది. అయితే తాను ఏదో ఒక స్థావర [static – నిశ్చల] సమాజాన్ని విశ్లేషిస్తున్నట్లు మార్క్స్‌ ఎన్నడూ భావించుకోడు; నిజానికి ఆయన కొన్నిసార్లు ' వర్గాలు' అంటూ ప్రస్తావించి చెప్పిన అనేక బృందాలు వేవేగంగా అంతరించి (అదృశ్యమై) పోతూండినాయికూడ. [ఉదాహరణకు] పెటీ బూర్జూవాలు, రైతాంగం ఈ విధమైన స్థితిలో వుండినాయి. అలాగే మార్క్స్‌ ప్రకారమైతే, భూయాజమాన్య వర్గంకూడ విచ్ఛిన్నమై అంతిమంగా యిటు పెట్టుబడిదారీ వర్గంలోనో లేక అటు అధోకార్మికవర్గంలోనో [వికసిత పెట్టుబడిదారీ సమాజంలో వుండే ఈ రెండే రెండు వర్గాల్లో దేనిలో ఒకదానిలో] కలిసిపోకతప్పదు.
రెండవదేమంటే, వర్గంగురించిన తన నిర్వచనంలో మార్క్స్‌ ఒక గతిశీల, స్వీయమానసిక [లేక కర్తృపర? - subjective] మూలాంశాన్ని కూడ చొప్పించివున్నాడు. తానొక వర్గమనే స్వీయ చైతన్యం కలిగివున్నప్పుడే ఏదైనా వర్గం ఉనికిలో వుంటుంది అంటాడు; అంటే దీని అంతరార్థం ఆ బృందం వేరొక సాంఘిక బృందంతో సామాన్య (బృందసభ్యులందరి ఉమ్మడి) వైరం కలిగి వుండాల్సి వస్తుందన్నమాట. తన సొంత ప్రయోజనాలు యితర వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా వున్నట్లే ఏదైనా వర్గం ఎప్పుడూ ఆలోచిస్తూంటుంది; అలాంటి [ప్రత్యేక (విరుద్ధ)] ప్రయోజనాల [సాధన] కోసం పోరాడడానికి దాన్ని [ఆ వర్గాన్ని] సంఘటితంగావించాల్సి వుంటుందికూడ. కనుక, మార్క్స్‌ కొన్నిసార్లు, పెట్టుబడిదారులైనా ఒక వర్గంగా ఏర్పడివున్నారా లేరా అని తటపటాయిస్తూండినాడు కూడ. మార్క్స్‌ తన జర్మన్‌ భావజాలం లో వాళ్లను [పెట్టుబడిదారులను] గురించి మాట్లాడుతూ, " ఈ ప్రత్యేక (వేరు వేరుగా వుండే) (పెట్టుబడిదారీ) వ్యక్తులంతా మరొక వర్గంతో తామొక ఉమ్మడి పోరాటం (యుద్ధం) చేయాల్సివచ్చేంత మేరకు ఒక వర్గంగా ఏర్పడివుంటారు [అని చెప్పవచ్చు]; అలా లేనప్పుడు వాళ్లు ఒకరితో మరొకరు పోటీదారులుగా పరస్పర శత్రు (వైర) స్థితిలో వుంటారు,"[11] అని అంటాడు. మరి అధోకార్మిక వర్గానికీ యిదే వర్తిస్తుంది. తన తత్వశాస్త్ర దారిద్ర్యం లో మార్క్స్‌ ఊహాస్వర్గ (లేక ఊహాజనిత) సోషలిజంగురించి చెబుతూ, 'తానొక వర్గంగా ఏర్పడేందుకు అధో కార్మిక వర్గం ఇంకా తగినంతగా అభివృద్ధి చెందిలేనట్టి' కాలానికి చెందిన విలక్షణత [ఆదర్శ భావన] అదనీ, "పర్యవసానంగా … అప్పటికి అధోకార్మిక వర్గానికీ, బూర్జువా వర్గానికీ మధ్య పోరాటానికే యింకా ఒక రాజకీయ స్వభావమంటూ వుండదు," అనీ వివరిస్తాడు. [ఇంకాకూడ,] అదే రచనలో అధోకార్మికవర్గంగురించి, "ఈ జనం యిప్పటికే పెట్టుబడికి విరుద్ధమైన ఒక వర్గంగావున్నా, యింకా తమకై తాము [దానికై అదిగా] ఒక వర్గంగా ఏర్పడి [అయితే] లేరు,"[12] అని చెబుతాడు. పోతే, కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే, " ఒక వర్గంగా, పర్యవసానంగా ఒక రాజకీయ పక్షంగా, అధోకార్మికుల ఈ సంఘటన (నిర్మాణం), అసలుకు కార్మికులనడుమే చెలరేగే పోటీ చేత నిరంతరం (సదా) తల్లక్రిందులు చేయబడుతూ వస్తూంది,"[13] అని కూడ అంటాడు మార్క్స్‌. ఇంకా, 1866 అంత ఆలస్యంగా (లేటుగా) కూడ మార్క్స్‌, అంతర్జాతీయ సంస్థ (ఇంటర్నేషనల్‌) "కార్మికుల్ని ఒక వర్గంగా సంఘటిత పరచడానికి (నిర్మాణం గావించడానికి) [సాధనమైన] ఒక నిర్మాణం [ఆర్గనైజేషన్‌],"[14] అని పేర్కొంటాడు. మార్క్స్‌ తన లూయీ బోనపార్టీ యొక్క పద్దెనిమిదవ బ్రుమైర్‌ గ్రంథంలో ఫ్రెంచి రైతాంగాన్ని వర్ణించేటప్పుడు ఈ అంశాన్ని అత్యంత స్పష్టంగా వివరించిచెబుతాడు [యిలా]:
"తమ జీవితవిధానం, తమ ప్రయోజనాలు, తమ సంస్కృతుల్ని యితర వర్గాలకు సంబంధించినవాటినుండి [అంటే వాటి జీవిత విధానం, ప్రయోజనాలు, సంస్కృతులనుండి] వేర్పాటుగావించే ఆర్థిక మనుగడ పరిస్థితుల్లో లక్షలాది కుటుంబాలు బతికేంత మేరకు అవి ఒక వర్గంగా ఏర్పడి వుంటాయి [అనవచ్చు]. అయితే ఆ చిన్న కమతాల రైతులమధ్య కేవలం ఒక స్థానిక సంబంధంమట్టుకే వుండి, వాళ్ల ప్రయోజనాల మధ్యనుండే సామాన్యత్వం (identity of their interests) వాళ్లమధ్య ఒక సముదాయాని ఏర్పాటు చేయ [లే] కుండా, ఒక జాతీయ బంధాన్ని సృష్టించ [లే] కుండా, ఒక రాజకీయ నిర్మాణాన్ని దేన్నీ ఏర్పాటుచేయ [లే] కుండా వుండేంత మేరకు వాళ్లు ఒక వర్గంగా ఏర్పడి వుండరు. పర్యవసానంగా వాళ్లు తమ సొంత పేరిట తమ వర్గ ప్రయోజనాన్ని అమలుచేయలేని అశక్తులై వుంటారు …"[15]
ఈ సందర్భంగా [ఇందుకు సంబంధించి] మనం గమనించ వలిసిందేమంటే మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికలో కార్మికులకు పితృభూమి [లేక మాతృభూమి] అంటూ ఏదీ లేదని ఉద్ఘాటించినప్పటికీ మళ్లీ అందులోనే ఆయన 'జాతీయ వర్గం' అనే భావనను కూడ ఉపయోగిస్తాడు. ఇంకాకూడ, అదీ కమ్యూనిస్టు ప్రణాళిక లోనే, "అధోకార్మిక వర్గం అన్నింటికంటే మొదటగా రాజకీయ ఔన్నత్యం (political supremacy) సంపాదించుకోవాలి కాబట్టి, జాతికే నాయకత్వ వర్గంగా ఎదగాల్సి వుంటుందికాబట్టి, తన్ను తాను జాతిగా ఏర్పరుచుకోవాల్సి వుంటుందికాబట్టి, అది ఆ మేరకు స్వయంగా జాతీయమైనదిగా (జాతీయవర్గంగా) వుంటుంది," అనికూడ అంటాడు.[16]
ఈ విధంగా ' వర్గం' అనే పదాన్ని ప్రయోగించడానికి మార్క్స్‌ అనేక ప్రమాణాలు వాడాడని, అవి (ఆ ప్రమాణాలు) అన్నీ అన్ని సమయాల్లో అన్వయించలేదనీ గమనిస్తాము. వ్యాప్తిలోవున్న ఉత్పత్తివిధానంతో ఏదైనా బృందానికి వుండే సంబంధం, తానొక వర్గమనే స్వీయచైతన్యం కలిగి వుండడంతోబాటు దానికి అనుబంధమైన రాజకీయ నిర్మాణంకూడ ఆ బృందం కలిగివుండడం వాటిల్లో రెండు ముఖ్యమైన ప్రమాణాలు అని తెలుసుకొంటాము.
ఆధునిక సమాజంలో వర్గాల ఉనికిని లేక వర్గపోరాటపు వాస్తవికతను తాను కనుగొన్నానని చెప్పుకొని ఖ్యాతిబడయడానికి మార్క్స్‌ నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. బూ్ర్జువా చరిత్రకారులు, అర్థశాస్త్రవేత్తలు ఆ పని ఎప్పుడో చేసివున్నారు. అయితే ఈ వర్గాల ఉనికి ఉత్పత్తి వికాస క్రమంలో కొన్ని ప్రత్యేక చారిత్రక దశలకు లంకె పడివుంటుందనీ, ఈ వర్గ పోరాటం [అనివార్యంగా] కార్మికవర్గ నియంతృత్వానికి, [తద్వారా] ఒక వర్గరహిత సమాజానికీ దారి తీస్తుందనీ[17] చూపించగలడమే తన భావనల్లో వినూత్నమైన అంశమని మార్క్స్‌ భావిస్తాడు [భావించి చెబుతాడు].
[1] ఎంపిక చేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 169.
[2] పోల్చి చూడు: ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్ రచనలు, పు. 506.
[3] ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 222.
[4] ఈ విషయమై మామూలుగా ఉల్లేఖించబడే పెట్టుబడి గ్రంథంలోని రచనాభాగంలో మాత్రం, అందుకు సంబంధించిన మరింత విస్తృత సందర్భాన్ని బట్టి స్పష్టమయేటట్లు, కేవలం అంతకంతకూ అధికమయ్యే నిరుద్యోగ ప్రజారాశిగురించి మాత్రమే ప్రస్తావించబడుతుంది.
[5] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 259.
[6] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. …
[7] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 561.
[8] జర్మన్‌ భావజాలం, పు. 61.
[9] కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 229.
[10] కార్ల్‌ మార్క్స్‌, ఫ్రాన్స్‌లో వర్గపోరాటాలు, మార్క్స్‌-ఏంగెల్స్‌ల ఎంపిక చేయబడ్డ రచనలు, సం. 1, పు. 155.
[11] జర్మన్‌ భావజాలం, పు. 48 నుండీ.
[12] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 212, 214.
[13] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 228.
[14] కుగెల్‌మన్‌కు మార్క్స్‌ లేఖ, మార్క్స్‌ ఏంగెల్స్‌ల రచనలు, సం. 31, పు. 529.
[15] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 317 నుండీ.
[16] కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 235.
[17] పోల్చి చూడు: కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 341.

Monday, May 19, 2008

ON INDO-NEPAL TREATY AND SPECIAL RELATIONSHIP WITH INDIA

ON INDO-NEPAL TREATY

I think the open borders should continue and it is the Nepalese who benefit most from it. Introducing visa by Prachanda will also mean Nepalese have to get visa from India too and that will affect the livelihoods of millions of Nepalese who periodically come to India to make some money and go back home. Prachanda should not be swept by national chauvinism. Likewise India and China cannot be equated. Nepal had, has and will have a special relationship with India. It is almost like a border state of India and the people there I found to be so comfortable with Hindi and relations with Indians (except of course any exploiters among them). If there are any other specific clauses and instances of injustice to Nepal those should be discussed threadbare and sorted out in a spirit of friendship and mutual cooperation. Of course a review of the treaty and subsequent arrangements there should be.

పరాయీకరణగురించి మార్క్స్‌-4

పరాయీకరణగురించి మార్క్స్‌-4
[మార్క్స్‌] మూలపాఠాలు
పెట్టుబడిదారు వ్యక్తిమూర్తీభవిత [వ్యక్తిగా మూర్తీభవించిన] పెట్టుబడిలాగామాత్రమే తన విధి నిర్వర్తిస్తాడు [నిర్వర్తించ గలుగుతాడు]. వ్యక్తిగా మార్చబడ్డ పెట్టుబడే అతడని చెప్పవచ్చు. అలాగే, కార్మికుడు [కూడ] వ్యక్తిమూర్తీభవిత శ్రమ మాత్రమే… కనుక సరిగ్గా భావజాలరంగంలో మతం విషయంలో మనకు లభించే సంబంధంలాంటిదే భౌతిక (పాదార్థిక) ఉత్పత్తిలోకూడా మనకు లభిస్తుంది – కర్త (పరమైన అంశాలు) కర్మ (పర వస్తువులు) గానూ, దీనికి వ్యతిక్రమం (తలకిందులు) గానూ మారడం గమనిస్తాము.

చారిత్రక దృష్టికోణంనుండి చూస్తే ఈ వ్యతిక్రమం (తలకిందుల ప్రక్రియ) బలప్రయోగంద్వారా, అత్యధిక సంఖ్యాకులకు నష్టదాయకంగా అసలు సంపద అనేదాని సృష్టికి – అంటే ఏది మాత్రమేనైతే ఒక స్వతంత్ర మానవసమాజానికి పాదార్థిక ప్రాతిపదిక ఏర్పాటు చేయగలదో అలాంటి అపరిమిత సాంఘిక శ్రమ ఉత్పాదకతను సృష్టించడానికి – అవసరమైన ఒక పరివర్తనాదశగా అగుపడుతుంది. మరి మనిషి తన స్వీయ ఆధ్యాత్మిక శక్తులనే తనకు వేరైన ఏవో స్వయం-స్వతంత్ర శక్తులుగా తనకే ఎదురు నిలుపుకొనడంద్వారా వాటికి ఒక మత రూపాన్ని ప్రసాదించడమనేది ఎలా అనివార్య ఆరంభమో, అలాగే పైనచెప్పిన తలకిందుల (వ్యతిక్రమ) క్రమంగుండా సాగిపోవడంకూడ ఆవశ్యకమే అవుతుంది.
ఇది మనిషి సొంత శ్రమయొక్క పరాయీకరణ క్రమం. [అయితే ఇందులో] మొదటినుండీ కార్మికుడు పెట్టుబడిదారుకంటే శ్రేష్ఠుడై వుంటాడు – ఎందుకంటే, పెట్టుబడిదారు తన పరాయీకరణ క్రమంలో తాను వేళ్లూనుకుని పోయి, దానితో పూర్తిగా సంతుష్టి చెందివుంటాడుగాని దానిచే బాధితుడై వుండే కార్మికుడుమాత్రం మొదటినుండీ దానికి [ఆ పరాయీకరణ క్రమానికి] వ్యతిరేకంగా తిరుగుబాటు మనస్తత్వంతో వుంటాడు; అది తన్ను దాస్యంలోకి తోసివేసే (బానిసను గావించే) ఒక క్రమంగా స్వీయానుభవం పొందుతూంటాడు. పెట్టుబడియొక్క స్వయం-విలువీకరణ – అంటే అదనపు విలువ సృష్టే – పెట్టుబడిదారుకు నిర్ణయాత్మకమైన, సర్వ శ్రేష్టమైన, ఆధిపత్య లక్ష్యంగా, అతడి క్రియాకలాపాలకు సంపూర్ణ చోదకోద్దేశ్యం, సారాంశాలుగా వుంటుంది; ఒక లోభియొక్క హేతుబద్ధ సహజానుభూతిగా, లక్ష్యంగా వుంటుంది. మరి ఈ సారాంశం చాల నాసిరకంది – పెట్టుబడిదారుకూడ కార్మికునికిలాగే పెట్టుబడికింద ఒకేవిధమైన బానిసత్వ సంబంధంలో మగ్గుతుంటాడని, కాకుంటే అతడు కార్మికునికి వ్యతిరేక ధ్రువంలో నిలిచివుంటాడంతమాత్రమే నని [ఈ నాసి సారాంశం] ప్రదర్శిస్తుంది. – తక్షణ ఉత్పత్తి క్రమపు ఫలితాలు (1865), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పుట 508 నుండి…
బాగా పరీక్షిస్తే, దోపకంచేయడానికి దానికుండే అవసరం ప్రకారం (ఆ మేరకు) పెట్టుబడి, శ్రమ [శ్రామిక] బలగం ఉత్పత్తినే, అంటే దోపకం చేయబడవల్సిన (దోపకం చేయబడే) మానవ సమూహాల సృష్టినే క్రమబద్ధం గావిస్తుందని మనం గమనిస్తాము. ఈ విధంగా పెట్టుబడి సృష్టించేది ఒక్క పెట్టుబడినిమాత్రమే కాదు; అంతకంతకూ వృద్ధి చెందే కార్మిక సందోహాన్ని కూడ – ఈ సారపదార్థం (పెరిగిపోయే కార్మికుల) ధర్మమా అనే అది ఒంటరిగా అదనపు పెట్టుబడిగా పని చేయగలుగుతుందని గమనించాలి – సృష్టిస్తుంది. పర్యవసానంగా, శ్రమ [లేక శ్రామికులు] అంతకంతకూ విస్తృత ప్రమాణంలో, అదీ స్వయంగా తనకే విరుద్ధంగా, శ్రమ పరిస్థితుల్ని పెట్టుబడి రూపంలో సృష్టించడమొక్కటే కాదు; పెట్టుబడికూడ అంతకంతకూ అధిక స్థాయిలో తనకు అవసరమైన ఉత్పాదక వేతన-శ్రామికుల్ని సృష్టిస్తూంటుంది. శ్రమ తన ఉత్పత్తి పరిస్థితుల్ని పెట్టుబడిగా సృష్టిస్తుంది; కాగా పెట్టుబడి శ్రమను ఒక పెట్టుబడి సాధక సాధనంగా, అంటే వేతన శ్రమగా సృష్టిస్తుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి ఈ సంబంధపు మామూలు (సామాన్య) పునరుత్పత్తి కాదు, అది అంతంతకూ ఇతోధిక ప్రమాణంలో సాగే పునరుత్పత్తి అని గ్రహించాలి. ఇక పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంవల్ల శ్రమయొక్క సామాజిక ఉత్పాదకత పెరిగిపోయే కొద్దీ, ఖచ్చితంగా ఆ పెరుగుదల మేరకు కార్మికుని పైన [సవారీ చేస్తూ నిలిచి] వుండే సంపదకూడ పెరిగిపోతూ పెట్టుబడిగా అతడిపై ఆధిపత్యం చెలాయిస్తూంటుంది. అతడి కట్టెదుట ఒక సుసుంపన్న ప్రపంచం – అతడికి పరాయిదైన, అతడ్ని అణచివేసే ప్రపంచం – [సుఖవిలాసాలతో అతడ్ని వెక్కిరిస్తూ] నెలకొల్పబడి వుంటుంది; అదే అనుపాతంలో అతడి పేదరికం, అవమానాలు, వ్యక్తిగత దాస్యం పెరిగిపోతుంటాయి. అతడి 'దిగంబరత్వం' ఈ విస్తృతికి సాపేక్ష ప్రమాణంగా వుంటుంది. అదే సమయంలో పెట్టుబడియొక్క సజీవ ఉత్పత్తి సాధనాల మొత్తం, అంటే శ్రమచేసే అధోకార్మికవర్గం పెరిగిపోతూంటుంది. – తక్షణ ఉత్పత్తి క్రమం ఫలితాలు (1865), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 518.

కనుక వర్తకపు సరుకు ఒక విచిత్ర నిగూఢ వస్తువు; కేవలం మనుషుల శ్రమయొక్క సాంఘిక స్వభావం ఆ శ్రమోత్పత్తిపై ముద్రించబడిన ఒక వస్తుగత స్వభావంగా వారికి అగుపించడం వల్ల, ఈ ఉత్పత్తిదారులకు తమ సొంత శ్రమల వెరసిమొత్తంతో వుండే సంబంధం నిజానికి వాళ్ల నడుమ వుండే సంబంధంగాకాక ఏదో వాళ్ల శ్రమోత్పత్తులమధ్య గల సంబంధంగా వాళ్లకు ప్రదర్శింపబడడంవల్ల అదిలా (మాయావి వస్తువుగా) వుంటుందని చెప్పవచ్చు. శ్రమోత్పత్తులు వర్తకపు సరుకులుగా – ఒకే సమయంలో ఇంద్రియగ్రాహ్యంగా [కొంత] నూ, అలాగే ఇంద్రియాలకు అగ్రాహ్యంగా [కొంత] కూడానూ వుండే ధర్మాలుగల సామాజిక వస్తువులుగా – రూపొందడానికి కారణం యిదే. దీనికి సమ ఉదాహరణకోసం మనం మతప్రపంచపు పొగమంచు కమ్మిన ప్రాంతాల్లో వెదకాల్సి వుంటుంది. ఆ ప్రపంచంలో మానవ మేధో సృజనలే స్వతంత్ర జీవులుగా ఊపిరి పోసుకుని పరస్పరమున్నూ, అలాగే మానవజాతితోనూ సంబంధాలు పెట్టుకోవడం మనం చూస్తాము. మరి వర్తకపు సరుకుల ప్రపంచంలో మనుషుల చేతి తయారీల విషయంలోకూడ సరిగా యిలాగే వుంటుంది. దీన్నే నేను అవి వర్తకపు సరుకులుగా ఉత్పత్తి చేయబడడంతోటే శ్రమోత్పత్తులకు అంటుకునే, అందుచేత వర్తకపు సరుకుల ఉత్పత్తినుండి విడదీయ శక్యం కాకుండా వుండే చిత్రమహిమ (లేక సరుకుల మాయ - Fetishism) అంటాను.
ఇంతవరకు జరిపిన విశ్లేషణలో ఈ వరకే వెల్లడయినట్లు, ఈ వర్తకపు సరుకుల చిత్రమహిమ (సరుకుల మాయ) కు పుట్టుక వాటిని ఉత్పత్తిగావించే శ్రమయొక్క విలక్షణ సాంఘిక స్వభావంలోనే వున్నది. – పెట్టుబడి, సంపుటం 1 (1867), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 436.

ఇంకా చదవడానికి …
1. డి. బెల్‌, 'పరాయీకరణపై వాదోపవాదాలు', ఎల్‌. లాబెజ్‌ (సం.), రివిజనిజం పుస్తకం (లండన్‌, 1962) లోంచి.
2. డి. బ్రేబ్రూక్‌, ' మార్క్స్‌యొక్క పరాయీకరణ సిద్ధాంతంలోని [రోగ]పరీక్ష, పరిహారసూచన', సోషల్‌ రిసర్చ్‌ (శరత్కాలం, 1958).
3. డి. బ్రేబ్రూక్‌, అవసరాలు కలవడం (ప్రిన్స్‌టన్‌, 1987).
4. ఎ. బుకానన్‌, మార్క్స్‌ మరియు న్యాయధర్మం: ఉదారవాదంపై సమూలమార్పు విమర్శ (టొటోవా, 1982), అధ్యాయం 3.
5. ఎల్‌. ఈస్టన్‌, 'తొలికాలపు (యువ) మార్క్స్‌లో పరాయీకరణ, చరిత్రలు', తత్వచింతన-ఘటనావిజ్ఞాన పరిశోధన (ఫిలాసఫీ అండ్‌ ఫెనామెనాలాజికల్‌ రిసర్చ్‌), డిసెంబర్‌, 1961.
6. ఎల్‌. ఈస్టన్‌, 'మార్క్స్‌ ఆలోచనలో పరాయీకరణ, అనుభవవాదాలు', సోషల్‌ రిసర్చ్‌ (శరత్కాలం, 1970).
7. ఎ. హెల్లర్‌, మార్క్స్‌లో్ని ఆవశ్యకతా సిద్ధాంతం, లండన్‌, 1976.
8. కె. లోవిత్‌, 'మార్క్స్‌ తొలి రచనల్లోని స్వీయ-పరాయీకరణ', సోషల్‌ రిసర్చ్‌, 1954.
9. ఎస్‌. లూక్స్‌, 'పరాయీకరణ, అనామకత్వం', ఫిలాసఫీ, పాలిటిక్స్‌ అండ్‌ సొసైటీ లో, 3వ పరంపర, సం. పి. లాస్లెట్‌- డబ్ల్యూ. జి. రన్సిమన్, ఆక్స్‌ఫర్డ్‌, 1967.
10. ఇ. మాండెల్‌-జి. నొవాక్‌, పరాయీకరణగురించిన మార్క్సిస్టు సిద్ధాంతం, రెండవ ప్రతి, న్యూయార్క్‌, 1973.
11. ఎమ్‌. మార్కోవిక్‌, 'పరాయీకరణపై మార్క్స్‌ విమర్శ, దాని విమోచనాత్మక పర్యవసానాలు', మార్క్స్‌ ఎన్‌ పర్స్పెక్టివ్‌, సం. బి. చవాన్స్‌, పారిస్‌, 1985, లో.
12. డి. మెక్‌లెలాన్‌, 'అపరాయీకృత సమాజంగురించి మార్క్స్‌ అభిప్రాయాలు', రివ్యూ ఆఫ్‌ పాలిటిక్స్‌, అక్టోబర్‌, 1969.
13. బి. ఓల్‌మన్‌, పరాయీకరణ: పెట్టుబడిదారీ సమాజంలోని మనిషిపై మార్క్స్‌ విమర్శన, కేంబ్రిడ్జ్‌, 1971.
14. జె. ఒనీల్‌, 'పరాయీకరణ, వర్గ పోరాటం, మార్క్సియన్‌ రాజకీయవ్యతిరేకతలు', రివ్యూ ఆఫ్‌ మెటాఫిజిక్స్‌, 1964.
15. జె. ఒనీల్‌, 'కార్ల్‌ మార్క్స్‌ తొలి, మలి రచనల్లోని ఎడబాటు భావన (concept of estrangement) గురించి', ఫిలాసఫీ అండ్‌ ఫెనామెనాలాజికల్‌ రిసర్చ్‌, సెప్టెంబర్‌ 1964.
16. జె. ప్లామెనాట్జ్‌, మనిషినిగురించిన కార్ల్‌ మార్క్స్‌ తత్వచింతన, ఆక్స్‌ఫర్డ్‌, 1975, భాగాలు 1 & 2.
17. పి. రాబర్ట్స్‌-ఎమ్‌. స్టీఫెన్సన్‌, మారకం, పరాయీకరణ, సంక్షోభాలను గురించిన మార్క్స్‌ సిద్ధాంతం, స్టాన్‌ఫర్డ్‌, 1973, అధ్యాయం 6.
18. ఎన్‌. రోటెన్‌స్ట్రీక్‌, పరాయీకరణ: ఆ భావన, దానికి లభించిన స్వాగతం, లైడెన్‌, 1989.
19. ఆర్‌. షాక్ట్‌, పరాయీకరణ, లండన్‌, 1971.
20. ఎల్‌. సెవే, మార్క్సిస్టు సిద్ధాంతంలో మనిషిగురించి, హాసక్స్‌, 1978, భాగం 2.
ఇంకా మార్క్సిజానికి సంబంధించిన అవినేరీ, ఫ్రామ్‌, మెక్‌లెలాన్‌, టక్కర్‌ల యితర పుస్తకాలు.
* * * * *

పరాయీకరణగురించి మార్క్స్‌-3

పరాయీకరణగురించి మార్క్స్‌-3
[మార్క్స్‌] మూలపాఠాలు - 2

సజీవ శ్రమశక్తికి ప్రతిగా [విరుద్ధంగా] విలువ స్వతంత్రంగా, స్వయం-ప్రతిపత్తితో మని వుండడం –
అందుచేత అది పెట్టుబడిగా మని వుండడం –
వస్తుగత [కర్మపదార్థగత], స్వయంకేంద్రీకృత అలక్ష్యం, సజీవ శ్రమశక్తికి ప్రతిగా భౌతిక [పాదార్థిక] శ్రమ పరిస్థితుల పరాయి స్వభావం [ఈ రెండూ] ఎంత [హెచ్చు] స్థాయికి చేరుకున్నాయంటే –
(1) ఈ పరిస్థితులు ఒక వ్యక్తిగా కార్మికునికి ఎదురుగా పెట్టుబడి దారుని వ్యక్తి రూపంలో [తమ సొంత సంకల్పం, ప్రయోజనాలతో కూడుకున్న వ్యక్తిఅవతారాలుగా] తారసపడుతాయి; ఈవిధంగా ఒక సంపూర్ణమైన వేర్పాటు, యాజమాన్య విచ్ఛిత్తి [అంటే, సజీవ శ్రమశక్తినుండి భౌతిక శ్రమ పరిస్థితులకు] సంభవిస్తాయి; ఈ పరిస్థితులు ఏదో ఒక పరాయి ఆస్తిగా, ఎవరో మరొక చట్టపర వ్యక్తియొక్క వాస్తవికతగా, అలాంటి వ్యక్తుల సంకల్పపు అఖండ ఆధిపత్య క్షేత్రంగా కార్మికున్ని ఎదిరిస్తూ ప్రత్యక్షమవుతాయి – ఇంకా కూడ,
(2) [దానివల్ల] శ్రమ అంతా పెట్టుబడిదారు రూపంలో వ్యక్తి అవతారం పొందిన విలువకూ, శ్రమ పరిస్థితులకూ విరుద్ధమైన ఏదో ఒక పరాయిశ్రమగా గోచరిస్తుంది.
మరి ఇలా ఆస్తికీ, శ్రమకూ నడుమ; సజీవ శ్రమశక్తికీ, దాని సాధనకు (యథార్థీకరణకు) వలసిన పరిస్థితులకూ నడుమ; సజీవ శ్రమకూ, వస్తుగత (పదార్థీకృత) శ్రమకూ నడుమ; విలువకూ, విలువను సృష్టించే కార్యకలాపానికీ నడుమ జరిగిన పూర్తి వేర్పాటు – అందుచేత స్వయంగా కార్మికునికే ఎదురుగా [అతడి] శ్రమ సారాంశం ఒక పరాయి ప్రకృతిని (స్వభావాన్ని) సంతరించుకోవడం – ఈ వేర్పాటిప్పుడు స్వయంగా శ్రమ (ఉత్పత్తి) ఫలంగానే, దాని [శ్రమ ఫలపు] స్వీయమూలాంశాల పదార్థీకరణగానే కనిపిస్తుందికూడ.
ఎందుకంటే, అసలుకు నూతన ఉత్పతి క్రియాచర్యనే [అది (నూతన ఉత్పత్తి క్రియాచర్య) కేవలం పెట్టుబడికీ, దానిపూర్వం వుండిన సజీవశ్రమకూ మధ్య మారకాన్ని ధ్రువీకరించిందంత మాత్రమే], ఇంకా అదనపు శ్రమా, కనుక అదనపు విలువా, అదనపు ఉత్పత్తీ [మిగులు ఉత్పత్తీ], టూకీగా మొత్తం శ్రమ (అంటే ఆవశ్యక శ్రమయొక్క, అలాగే అదనపు శ్రమయొక్కకూడ) ఫలితమంతా పెట్టుబడి గా, ఇటు సజీవ శ్రమశక్తికీ, అటు దాని కేవల ఉపయోగపు విలువకూ రెంటికీ విరుద్ధంగా స్వతంత్రంగా, అలక్ష్య పూరితంగా [వాటినేమీ లెక్కచేయని విధంగా] మనివుండే మారకపు విలువగా వ్యవస్థాపితమవుతుంది.
శ్రమశక్తి ఆవశ్యక శ్రమయొక్క స్వీయమానసిక [లేదా కర్తృపర] పరిస్థితులను మాత్రమే అవలంబించింది – అంటే ఉత్పాదక శ్రమ శక్తికి అత్యాజ్యఅవసరమైన బతుకుగడుపునుమాత్రమే అంటే కేవలం శ్రమశక్తిగా పునరుత్పత్తికావడానికి అవసరమైన మొత్తాన్నిమాత్రమే – ఆ శ్రమశక్తి సాధన (యథార్థీకరణ) కు సంబంధించిన పరిస్థితులతో నిమిత్తం లేకుండా, వాటికి వేరుగా – అవలంబించింది. అంతేకాక అదే (శ్రమశక్తే) ఈ పరిస్థితుల్ని లక్ష్యాలు, విలువలుగా నెలకొల్పింది; అవి ఒక పరాయి, అధికారనిరంకుశవాద వ్యక్తిమూర్తీభావంగా దానికి (శ్రమశక్తికి) విరుద్ధంగా ఎదురుపడుతుంటాయి.
ఈ క్రమంనుండి అది (శ్రమశక్తి) మరింత సంపన్నమై కాదుగదా, నిజానికి అది ఈ క్రమంలో ప్రవేశించినప్పటికంటే మరింత పేదదై వెలికి వస్తుంది. ఎందుకంటే అది [శ్రమశక్తి] ఉత్పత్తి చేసిన ఆవశ్యక శ్రమ పరిస్థితులు పెట్టుబడికి చెందివుండడమే కాదు; ఇప్పుడు శ్రమ శక్తిలో అంతస్థమైవున్న విలువల్ని సృష్టించే సంభావ్యత (సాధ్యత - possibility) కూడ అదే విధంగా అదనపు విలువగా, అదనపు ఉత్పత్తిగా, ఒక్క మాటలో, పెట్టుబడిగా – సజీవ శ్రమశక్తిపై ఆధిపత్యంగా, శ్రమశక్తియొక్క అనిర్దిష్టమైన, ఉద్దేశ్యరహితమైన, శుద్ధ స్వీయమానసికమైన [లేక కర్తృపరమైన - subjective] పేదరికానికి విరుద్ధంగా తన సొంత బలం, సంకల్పాలతో తులతూగే విలువగా మనివుంటుంది. శ్రమశక్తి పరాయి[దైన] సంపదనూ, తన సొంత పేదరికాన్నీ సృష్టించడం మాత్రమే కాదు; ఈ అంతర్గత సంపదకు పేదరికమైవున్న తన స్వీయ అస్తిత్వంతో (అంటే శ్రమశక్తితో) ఒక సంబంధాన్నికూడ సృష్టించింది. ఈ [పేదరికమైవుండే] శ్రమశక్తిని వినిమయంచేసుకోవడంద్వారా, ఆ సంపద తనలోతాను కొత్త ఊపిర్లు నింపుకొంటుంది; తద్వారా తన్నుతాను మళ్లీ సఫలం గావించు కొంటుంది. ఇదంతాకూడ శ్రమశక్తి దాని సజీవ శక్తిని ఒక నిశ్చిత మొత్తపు పదార్థీకృత శ్రమరాశికిగాను మారకం చేసుకోవడంనుండి తలయెత్తింది. కాకపోతే, [మినహాయింపు లేక అపవాదం ఏమంటే,] ఈ పదార్థీకృత శ్రమ (objectified labour) – శ్రమకు బాహ్యంగా మనివుండే దాని అస్తిత్వకారక పరిస్థితులూ, ఈ భౌతిక (లేక పాదార్థిక) పరిస్థితులయొక్క స్వతంత్ర బాహ్య స్వభావమూ రెండూనూ – దాని [శ్రమయొక్క] సొంత ఉత్పత్తి ఫలంగా అగుపిస్తుంది. వాటిని స్వయంగా శ్రమశక్తే నెలకొల్పినట్లు – దాని సొంత పదార్థీకరణగానూ, ఇంకా, దానికి స్వతంత్రంగా మనివుంటూ, పైగా దానిపై శాసనం చేసే, తన సొంతకృషితో దానిపై పాలన చేసే దాని స్వీయశక్తి పదార్థీకరణ గానూ రెండువిధాలా నెలకొల్పబడినట్లు – ఈ పరిస్థితులు గోచరిస్తాయి. - గ్రండ్‌రిస్సే (1857-58), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 366 నుండి…

ఇప్పటికే దాని సులభసామాన్య రూపంలో ఈ సంబంధం ఒక విలోమం (తలకిందుల ప్రక్రియ) గా – వస్తువుయొక్క వ్యక్తి రూపీకరణ లేదా వ్యక్తియొక్క పదార్థీకరణగా వుంది. ఎందుకంటే దీనికి పూర్వపు సకల రూపాలకూ దీనికీ అంతరమేమంటే పెట్టుబడిదారు కార్మికునిపై శాసనం (ఆధిపత్యం) చెలాయించేది ఏదో అతడికుండే ఏవైనా వ్యక్తిగత గుణాలు, లక్షణాలద్వారాకాక, కేవలం తాను 'పెట్టుబడి' గా వుండడంవల్ల, అలా వున్నంతవరకుమాత్రమే. అతడి ఆధిపత్యం కేవలం సజీవ శ్రమపై పదార్థీకృత శ్రమకుండే, స్వయంగా శ్రామికుడిపైన అతడి శ్రమ [ఉత్పత్తి] ఫలానికుండే ఆధిపత్యంమాత్రమే.
ఈ సంబంధం యింకా మరింత సంక్లిష్టంగా, మరింత నిగూఢం (మార్మికం - mysterious) గా వృద్ధి చెందుతూంటుందికూడ - ఎందుకంటే, ప్రత్యేకించి పెట్టుబడిదారీతరహాలో ఉత్పత్తివిధానం వికసించేకొద్దీ, ఈ ప్రత్యక్షంగా పాదార్థికమైన (భౌతికమైన) వస్తువులు (అంటే శ్రమ ఉత్పత్తిఫలాలన్నీ; ఉపయోగపు విలువలుగా పరిగణించబడే టప్పుడు అవి ఇటు శ్రమయొక్క భౌతిక (పాదార్థిక) పరిస్థితులుగానూ, అటు శ్రమఫలాలుగానూ రెండు విధాలా వుంటాయి; మారకపు విలువలుగా పరిగణించబడేటప్పుడు అవి పదార్థీకృత సాధారణ శ్రమ కాలం లేదా డబ్బుగా వుంటాయి) మాత్రమే తమ వెనక్కాళ్లపై నిలబడి శ్రామికుడ్ని [వెక్కిరిస్తూ లేక ధిక్కరిస్తూ] ' పెట్టుబడి' గా ఎదిరిస్తాయి అన్నట్లేమీ [పరిమితమై] వుండదు; [అవి మాత్రమేకాక] ఇంకా సామాజికంగా వికసించిన [ఇతర] శ్రమ రూపాలు - సహకారం, తయారీ (ఒక శ్రమ విభజన రూపంగా), ఫాక్టరీ (కర్మాగారం - యంత్రాల పాదార్థిక ప్రాతిపదికపై వ్యవస్థీకృతమైన ఒక సాంఘిక శ్రమ రూపం) – కూడ, ఇవన్నీకూడ పెట్టుబడి అభివృద్ధి [వికాసక్రమ] రూపాలుగా అగుపిస్తాయి; అందువల్ల ఈ సామాజిక శ్రమరూపాల [పునాదులపై] నిర్మించబడ్డ శ్రమ ఉత్పాదక శక్తులన్నీకూడ – పర్యవసానంగా శాస్త్రవిజ్ఞానం, ప్రకృతిశక్తులుకూడ – పెట్టుబడియొక్క ఉత్పాదక శక్తులుగా అగుపిస్తాయి. నిజానికి, సహకారంలో [శ్రమ యొక్క] ఐక్యత, శ్రమ విభజనద్వారా శ్రమ సమ్మేళనం, యంత్ర పరిశ్రమలో ఉత్పాదక లక్ష్యాలకుగాను శ్రమ ఉత్పత్తుల సరసనే ప్రకృతి శక్తుల్నీ, శాస్త్ర విజ్ఞానాన్నీ ఉపయోగించడం - ఇవన్నీ స్వయానా వ్యష్టిశ్రామికులకు తమకు బాహ్యంగా, పదార్థీకృతంగా వుండే ఏదో ఒక పరిణామంగా, కేవలం తమకు స్వతంత్రంగావుంటూ, తమను అదుపాజ్ఞల్లో వుంచు కొనే శ్రమ సాధనాల అస్తిత్వ రూపంగా మాత్రమే ఎదురు పడుతుంటాయి; అసలుకు స్వయంగా ఆ శ్రమ సాధనాలే వాటి సులభసామాన్య గోచరరూపంలో, అంటే పదార్థాలూ, పరికరాలూ మొదలైనవాటిగా, నిజానికి పెట్టుబడియొక్క విధులుగా, పర్యవసానంగా పెట్టుబడిదారుని విధులుగా వారికెలా ఎదురు పడుతూంటాయో యివీ అంతే.
ఈ క్రమంలో వాళ్ల శ్రమయొక్క సాంఘిక స్వభావమే వాళ్లకు కొంత మోతాదులో పెట్టుబడీకృతం అయినట్లు (ఉదాహరణకు యంత్రాలనే గనుక తీసుకుంటే శ్రమోత్పత్తులుగా అగుపించే వస్తువులే శ్రమపై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు కనిపిస్తాయి) ఎదురు పడుతూంటుంది. మరి ప్రకృతిసంబంధ, విజ్ఞానశాస్త్రసంబంధ శక్తుల విషయంలోకూడ సహజంగా ఈవిధంగానే జరుగుతుంది; వాటి అఖండ సారాంశంలో అవి ఒక సాధారణ చారిత్రక వికాసోత్పత్తులై వుంటాయి; అలా వుంటూనే, అవి [యథార్థంలో] పెట్టుబడియొక్క శక్తులుగా శ్రామికులకు ఎదురుపడుతుంటాయి. నిజానికి అవి వ్యష్టి కార్మికుని నేర్పు (నిపుణత), పరిజ్ఞానాలకు వేరుగా నిలిచి వుంటాయి. పుట్టుకలో అవి [ప్రకృతిజన్య, వైజ్ఞానిక శక్తులు] కూడ శ్రమోత్పత్తులే అయినప్పటికీ, అవి ఎక్కడేగానీ శ్రమక్రమంలో ప్రవేశించినప్పుడల్లా పెట్టుబడిలో [భాగాలుగా] మూర్తీభవించినట్లే కనిపిస్తుంటాయి. ఏదైనా యంత్రాన్ని వాడే పెట్టుబడిదారుకు దాన్ని గురించి అర్థంచేసుకోవల్సిన అవసరం ఏమీ వుండదు. కాని ఆ యంత్రంలో రూపుదాల్చిన (యథార్థీకరించబడ్డ, సాధించబడ్డ - realized) విజ్ఞానశాస్త్రం మట్టుకు కార్మికులకు సంబంధించినంత వరకూ పెట్టుబడి గానే అగుపిస్తుంది. ఇంకా నిజానికి ఈ వైజ్ఞానిక (విజ్ఞాన శాస్త్రజన్య) అనువర్తణలు (అన్వయాలు - applications) అన్నీ, పెద్ద యెత్తున సృష్టయ్యే శ్రమోత్పత్తులు, ప్రాకృతిక శక్తులన్నీ, సాంఘిక శ్రమ ప్రాతిపదికన నెలకొనివుండే ఈ అన్వయాలన్నీ స్వయంగా శ్రమ దోపకానికి సాధనాలుగామాత్రమే, అదనపు విలువను భుక్తం చేసుకొనే సాధనాలుగానే అగుపడుతాయి. కనుక అవి పెట్టుబడికి చెందిన శక్తులుగా శ్రమకు (శ్రామికులకు) ఎదురుపడుతుంటాయి. మరి సహజంగానే పెట్టుబడి కూడ ఈ సాధనాలన్నింటినీ శ్రమను దోపకం చేయడానికే ఉపయోగిస్తుంది గదా. కాని దాన్ని దోపకం చేయాలంటే, అది (పెట్టుబడి) వాటిని ఉత్పత్తి [క్రమం] లో అన్వయించాల్సి వుంటుంది. అందుచేత శ్రమయొక్క సామాజిక ఉత్పాదక శక్తుల వికాసం, ఈ వికాసానికి వలసిన షరాస్థితులూ పెట్టుబడి యొక్క చర్యలు గా అగుపిస్తాయి. ఈ పెట్టుబడి చర్యలపట్ల వ్యష్టి శ్రామికుడు ఒక అనాసక్త (నిష్క్రియాపర) వైఖరి నవలంబించడమే కాదు; అసలుకు ఈ పరిణామాలన్నీ అతడికి విరుద్ధంగానే సంభవిస్తూంటాయి. - అదనపు విలువ సిద్ధాంతాలు (1862), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 393 నుండి.

పెట్టుబడి అంతకంతకూ అధికంగా తన్ను ఒక సాంఘిక శక్తిగా ప్రదర్శించుకొంటుంది; పెట్టుబడిదారు ఈ సామాజిక శక్తి (పెట్టుబడి) కి ఏజంటుగా వుంటాడు. ఇంకా అది (పెట్టుబడి), విడిగా ఏ వ్యక్తియొక్క శ్రమయినా సృష్టించగల వస్తువులతో ఎలాంటి సంబంధమైనా కలిగి వుండే అవకాశమే వుండదుకూడ. పెట్టుబడి ఒక వింతైన, స్వతంత్ర మైన, సామాజిక శక్తిగా రూపొందుతుంది; అది ఒక వస్తువులా సమాజాన్ని ఎదిరిస్తూ నిలిచివుంటుంది; ఇలా వస్తువులా వుండడంతో అది పెట్టుబడిదారుల చేతి అధికారశక్తిలా వుంటుంది. ఒక సాధారణ సాంఘిక శక్తిగా పెట్టుబడికీ, సామాజిక ఉత్పత్తి పరిస్థితులపై ప్రైవేటు పెట్టుబడిదారుల అధికారశక్తిలా వుండే పెట్టుబడికీ మధ్య వైరుధ్యం అంతకంతకూ రాజీలేని ఘర్షణగా పరిణమిస్తూంటుంది. పర్యవసానంగా, ఈ [ఉత్పత్తి] పరిస్థితులు రద్దు అయిపోయి, అవి [ఉత్పత్తి పరిస్థితులు] సవిస్తారంగా సార్వత్రిక, ఉమ్మడి, సామాజిక పరిస్థితులుగా రూపు దిద్దుకొంటాయని దీని అంతరార్థం అవుతుంది. మరి పెట్టుబడిదారీ ఉత్పత్తివిధానంలో జరిగే ఉత్పాదక శక్తుల వృద్ధి చేత, ఈ అభివృద్ధి జరిగే క్రమంమీద ఆధారపడి ఈ సవివర పరిణామం సంభవిస్తుంది. – పెట్టుబడి, సంపుటం 3 (1864-5), పు. 310.
పెట్టుబడి ఒక వస్తువు కాదు. సమాజపు ఒక నిశ్చిత చారిత్రక నిర్మాణానికి చెందిన ఒక నిశ్చిత అంతర సంబంధం అది…. సమాజంలోని ఒక నిశ్చిత భాగంచే గుత్తాధిపత్యంలో వుంచుకోబడ్డ ఉత్పత్తి సాధనాలను, సజీవ మానవ వ్యక్తులయొక్క శ్రమశక్తినుండి స్వతంత్రంగా, వాళ్లకు వైరపూర్వకంగా చేయబడిన శ్రమయొక్క పాదార్థిక అవసరాలను, శ్రమోత్పత్తులను, ఈ వైరంచేతనే పెట్టుబడిలో మూర్తీభవించబడిన [ఉత్పత్తి] సాధనాలను పెట్టుబడి సూచిస్తుంది. పెట్టుబడి అంటే శ్రామికులనుండి స్వతంత్రం గావించ బడి సామాజిక శక్తులుగా మార్చబడిన ఉత్పత్తులు – తమ స్వీయ స్రష్టలనే (ఉత్పాదకులనే) శాసిస్తూ, వాళ్లనే కొనివేస్తూండే ఉత్పత్తులు అని మాత్రమేకాదు అర్థం; ఉత్పాదకుల్ని వాళ్ల ఉత్పత్తుల గుణాల రూపంలో విరుద్ధంగావించుకొనే శక్తులు, సాంఘిక సంబంధాలు – ఈ శ్రమయొక్క రూపాలు – అని కూడ అర్థం వస్తుంది. కనుక, యిక్కడ మనకు ఒక చారిత్రకంగా సృష్టించబడిన (ఉత్పత్తి చేయబడిన) సాంఘిక ఉత్పత్తిక్రమ కారణాంశాల్లో ఒకదానియొక్క నిశ్చితమైన, మొదటి చూపుకు చాలా మాయాభరితమైన (నిగూఢమైన - mystical), సామాజిక రూపం అగుపిస్తుంది [లేక లభిస్తుంది]. – పెట్టుబడి, సంపుటం 3 (1864-5), ఎంపిక చేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌ రచనలు, పు. 492.

పరాయీకరణగురించి మార్క్స్‌-2

పరాయీకరణగురించి మార్క్స్‌-2

[మార్క్స్‌] మూలపాఠాలు

అమ్మకం అనేది బాహ్యీకరణ (externalization) యొక్క ఆచారం [ఆచరణ]. మనిషి మతంలోపల బందీ అయివున్నంతకాలం తన సారాంశాన్ని ఒక ఊహాత్మక, పరాయి అస్తిత్వంగా మార్చడంద్వారా దాన్ని వస్తుగతం (పదార్థీకృతం) గావించడమొక్కటే అతనికి తెలిసివుంటుంది. అదే విధంగా, స్వార్థపర అవసరాల ఆధిపత్యంలో [వున్నంతకాలం] అతడు తన ఉత్పత్తులను, తన కార్యకలాపాల్ని ఒక పరాయి అస్తిత్వపు ఆధిపత్యంలో వుంచి, వాటికి ఒక పరాయి అస్తిత్వపు – అంటే డబ్బుయొక్క ప్రాముఖ్యతను కలగజేయడం ద్వారామాత్రమే వ్యవహారికంగా, అంటే వ్యవహారాచరణద్వారా వస్తువులను సృష్టిస్తూ వుండగలుగుతాడు. – యూదుల సమస్యపై (1843), ఎంపికచేయబడ్డ కార్ల్‌ మార్క్స్‌రచనలు, పు. 61 పాదవివరణ.
ఈ వాస్తవం వ్యక్తీకరించేది కేవలం ఇది మాత్రమే: [మనుషుల] శ్రమ ఉత్పత్తి చేసే వస్తువులు, అంటే దాని ఉత్పత్తి [ఫలం], ఒక పరాయి అస్తిత్వంగా దాన్ని [ఆ శ్రమను] ఎదురుకొంటుంది; ఉత్పత్తి దారుకు స్వతంత్రంగా వుండే ఒక శక్తిగా ఎదురుపడుతుంది. శ్రమ యొక్క ఉత్పత్తిఫలం అంటే ఒక వస్తువు (లేక పదార్థం) గా ఘనీ భవించిన శ్రమ; తన్ను తాను ఒక వస్తువుగా, శ్రమయొక్క వస్తుగత రూపంగా చేసుకున్న శ్రమే. శ్రమయొక్క వాస్తవీకరణ (సాధన - realization) దాని వస్తుగతీకరణే (పదార్థీకరణే - objectification). రాజకీయార్థ రంగంలో ఈ శ్రమసాధన కార్మికునికి సంబంధించి వాస్తవికతను [యథార్థతను] కోల్పోవడంగా, వస్తుగతీకరణ అనేది అసలుకు [ఆ] వస్తువునే కోల్పోవడం లేక దానికి దాసోహమవడం [బానిసత్వం చేయడం] గా, దాని భుక్తం [భోగ వినియోగం - appropriation] ఒక పరాయీకరణగా, ఒక బాహ్యీకరణగా… వుంటుంది.
తన సొంత శ్రమ ఉత్పత్తిఫలాన్ని ఏదో ఒక పరాయి వస్తువుగా చూచేలాంటి బాంధవ్యం కార్మికుడు పెట్టుకొంటాడనే వాస్తవంనుండే ఈ పర్యవసానాలన్నీ ఉబికివస్తున్నాయి. ఎందుకంటే, కార్మికుడు తన పని [క్రమం] లో తన్నుతాను మరింతగా బాహ్యీకరించుకొనే కొద్దీ, అతడు తన కట్టెదుట సృష్టించుకొనే పరాయి, భౌతిక (వస్తుగత) ప్రపంచం మరింత శక్తివంతంగా అయేకొద్దీ, తన అంతరంగ జీవితంలో అతడు మరింత పేదగా మారిపోతుంటాడు; తనకు సొంతమని [భావించుకుని] అతడు పిలుచుకోగలిగేది మరింత తక్కువ అయి పోతూంటుంది. మతం [విషయం] లోకూడ సరిగ్గా యింతే. మనిషి దేవుడిలో మరింత మరింత [శక్తి, భక్తులు] వుంచేకొద్దీ తనలో తాను అతడు అట్టిపెట్టివుంచుకొనేది అంతకంతకూ తక్కువైపోతూ వుంటుంది. కార్మికుడు తన జీవితాన్ని వస్తువులో పోసి వుంచుతాడు; [కాని] దీనర్థం [చివరకు] అది [జీవితం] తనకు మరెంత మాత్రం చెందనట్లు, ఆ వస్తువుకే చెందుతుందన్నట్లు అయి పోతుంది. కనుక, ఈ కార్యకలాపం మరింత అధికంగా సాగేకొద్దీ, కార్మికుడు మరింత హెచ్చుగా వస్తువు లేకుండా [లక్ష్యవస్తువును కోల్పోతూ] వుంటాడు. తన శ్రమయొక్క ఉత్పత్తిఫలం ఏదో, అదైతే అతడు కాడు [కాజాలడు]. కనుక ఈ ఉత్పత్తిఫలం ఎంత అధిక తరమైతే అతడు స్వయానికి అంత అల్పతరమైపోతుంటాడు. [ఇలా] కార్మికుడు తన ఉత్పత్తిఫలంలో [ఉత్పత్తిక్రమంలో ఆ ఉత్పత్తినుండి] బాహ్యీకరణకు గురికావడమంటే దాని అంతరార్థం అతడి శ్రమ ఒక వస్తువు [కర్మ పదార్థం] గా, ఒక బాహ్య అస్తిత్వంగా అవుతుందనే కాక అది అతడికి వెలుపల స్వతంత్రంగా, పరాయిదిగా మని వుంటుందనీ, అతడికి ఎదురుగా ఒక స్వయంసమృద్ధ శక్తిగా రూపు ధరిస్తుందనీ, అతడు ఆ వస్తువుకు అందజేసిన జీవితం ఒక పరాయి, విరోధపూరిత శక్తిగా [అస్తిత్వంగా] అతడ్ని ధిక్కరిస్తుందనీ కూడానూ. - 1844 నాటి రాతప్రతులు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 78 పాదవివరణ.

మతం, కుటుంబం, రాజ్యం, న్యాయం, నీతివిజ్ఞానం, విజ్ఞానశాస్త్రం, కళలు యివన్నీ ప్రత్యేక ఉత్పత్తి రూపాలుమాత్రమే; ఇవన్నీ దాని (ఉత్పత్తి) సాధారణ న్యాయంకిందకు వస్తాయి. అందుచేత ప్రైవేటు ఆస్తియొక్క నిశ్చయాత్మక రద్దు, మానవజీవితపు భుక్తా (భోగ సాధన) లు మొత్తం పరాయీకరణయొక్క నిశ్చయాత్మక రద్దుగా, ఈ విధంగా మనిషి మతపర, కుటుంబ, రాజ్యపర, వగైరా అస్తిత్వాల నుండి తన మానవ అస్తిత్వానికి, అంటే సాంఘిక అస్తిత్వానికి వాపసు రావడంగా వుంటుంది. పోతే మతపరమైన పరాయీకరణ అనేది మనిషియొక్క అంతరంగ చైతన్యంలోమట్టుకే సంభవిస్తుంది గానీ ఆర్థిక పరాయీకరణ అనేది యథార్థ జీవితానికి సంబంధించి వుంటుంది; కాబట్టి దాని రద్దు ఉభయ కోణాల్నీ [అంటే అంతరంగ, బాహ్య చైతన్యాలు రెంటినీ] ఆవరిస్తుంది. [కాకపోతే] ప్రజలయొక్క వాస్తవిక చైతన్యయుత జీవితం వాళ్ల మనస్సుల్లో గడపబడుతూందా (జీవించబడుతూందా) లేక బాహ్య ప్రపంచంలో గడపబడుతూందా, అంటే అది ఒక ఆదర్శ [కల్పనాపర] జీవితమా లేక యథార్థ జీవితమా అనేదాని ప్రకారం ఈ గమనం వేర్వేరు జనాల్లో వేర్వేరు విధాలుగా ప్రారంభమౌతుందనేదిమాత్రం స్పష్టమే.
- 1844 నాటి రాతప్రతులు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 89 పాదవివరణ.

బాహ్యీకరణను లీనంచేసుకొనే (పీల్చివేసుకొనే) భౌతిక చలనం (లేక గమనం) గా పురోధిగమనం (supersession): ఒక భౌతిక (వస్తుగత) అస్తిత్వాన్ని దాని పరాయీకరణయొక్క పురోధిగమనం ద్వారా పున: భుక్తంగావించుకొనే ప్రక్రియకుసంబంధించిన, పరాయీకరణ లోపలే వ్యక్తీకరించబడే ఒక లోచూపు (అంతర్దృష్టి insight) యిది. మనిషియొక్క యథార్థ వస్తుగతీకరణ (కర్మపదార్థీకరణ) లోనికి, భౌతిక (పదార్థీకృత objectified) ప్రపంచపు పరాయీకృత స్వభావపు వినాశనంద్వారానూ, భౌతిక ప్రపంచపు పరాయీకృత స్వభావాన్ని అది పురోధిగమించడం ద్వారానూ, తన పరాయీకృత అస్తిత్వాన్ని అది పురోధిగమించడం ద్వారానూ, అతడి (మనిషియొక్క) భౌతిక (వస్తుగత) సారాంశపు యథార్థ భుక్తం (భోగవినియోగం) లోనికి సారించబడే ఒక పరాయీకృత అంతర్దృష్టి (లోచూపు) అది. అదే విధంగా, దేవుడి పురోధిగమనంగా వుండే నాస్తికవాదం ఒక సైద్ధాంతిక మానవతా వాదపు ఆవిర్భావంగానూ, ప్రైవేటు ఆస్తి పురోధిగమనంగా వుండే కమ్యూనిజం మనిషి ఆస్తి యథార్థ మానవీయ జీవితమేననే సూచనగానూ, అంటే అది వ్యవహారిక (ఆచరణాత్మక) మానవతా వాదపు ఆవిర్భావంగా కూడానూ వుంటుంది [అని గ్రహించాలి]. మరో విధంగా చెబితే, నాస్తికత్వం అనేది మతపు పురోధిగమనంద్వారా తన్నుతాను సమాధానపరుచుకొనే మానవతావాదంగానూ, పోతే కమ్యూనిజం అనేది ప్రైవేటు ఆస్తి పురోధిగమనంద్వారా తన్నుతాను సమాధాన పరుచుకొనే మానవతావాదంగానూ వుంటాయి. మరి ఈ సమాధాన ప్రక్రియ (mediation) యొక్క పురోధిగమనంద్వారా మాత్రమే – అయితే ఈ సమాధానప్రక్రియ ఒక ఆవశ్యక ముందుషరతుగానైతే వుంటుందనుకోండి – తనతోతానుగా (స్వయంభువుగా) ప్రారంభం అయ్యే నిశ్చయాత్మక మానవతావాదం ఉనికిలోకి వస్తుంది.
- 1844 నాటి రాతప్రతులు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 108.
[కా. RK మూర్తికి, పై పేరా చాల జటిలంగా వుంది. కనుక ఈ అనువాదాన్ని మీరు పలుమార్లు తిరిగి రాయాల్సి, మార్చాల్సి వుంటుందేమోకూడ. బాగా ఎడిట్‌ చేసినతర్వాతే ప్రచురించండి – IMS.]

నేను ఉత్పత్తిచేసింది నా కోసం, నీకోసం కాదు; అలాగే నీవుకూడ నీకోసమే ఉత్పత్తిచేసుకొన్నావుకాని నాకోసం కాదు. కనుక నా ఉత్పత్తి స్వయానా ఎలావున్నా నీకేమంత పట్టింపు లేదు; అలాగే నాకూ నీ ఉత్పత్తి సొంతతీరుతెన్నులగురించి ప్రత్యక్షంగా పట్టింపేమీ లేదు. అంటే, మన ఉత్పత్తి మనుషులు మనుషుల కోసమని చేసే ఉత్పత్తి అయితే, అంటే సాంఘిక ఉత్పత్తి అయితే కాదు. కనుక, ఈ విధంగానైతే, ఒక మనిషిగా మరొకరి ఉత్పత్తిని ఆనందంతో అనుభవించగలిగే స్థితిలో మనం ఎవ్వరమూ లేము. మన పరస్పర ఉత్పత్తులకుసంబంధించి మనం వాటి ఎదుట మనుషులుగా [నిల్చుని] లేము. కనుక, మనమధ్య మారకం అయినా నా ఉత్పత్తి నీకోసమేలే అని ధ్రువీకరించే ఒక సమాధాన కారక (mediating) గమనం (లేక ప్రక్రియ) గా వుండజాలదు; ఎందుకంటే అది నీ సొంత సారాంశపు, నీ అవసరపు వస్తుగతీకరణ (కర్మపదార్థీకరణ) మాత్రమే గనుక. ఎందుకంటే మన ఉత్పత్తుల్ని లంకెవేసివుంచేది మానవ సారాంశంకాదు గనుక. మారకం అనేది మనలో ప్రతి ఒక్కరికీ తన సొంత ఉత్పత్తి పట్ల వుండే దృక్పథాన్ని, తద్విధంగా మనకు యితరుల ఉత్పత్తుల పట్ల వుండే దృక్పథాన్ని చలనంలోకి తెచ్చి, క్రియాశీలంగావించగలదు అంతమాత్రమే. మనలో ప్రతి ఒక్కరూ తన సొంత ఉత్పత్తి [ఫలం] లో తన సొంత స్వార్థ ప్రయోజనాలు (అవసరాలు) వస్తుగతం (పదార్థీకృతం) అయి వుండడాన్నిమాత్రమే చూస్తాము; ఈ విధంగా [కనుక] మనలో ప్రతి ఒక్కరం మరొకరి ఉత్పత్తి [ఫలం] లో మనకు స్వతంత్రంగా, పరాయిదిగా వుండే మరొక స్వార్థ ప్రయోజనం (అవసరం) పదార్థీకరించబడి వుండడాన్ని మాత్రమే వీక్షిస్తాము.
అయితే ఒక మనిషిగా నీకు నా ఉత్పత్తి [ఫలం] తో ఒక మానవీయ సంబంధం వుంటుందనుకో – నా ఉత్పత్తియొక్క అవసరం నీకు వుంటుంది. కనుక అది నీ కోరికల, నీ సంకల్పపు లక్ష్యవస్తువుగా నీ ఎదుట హాజరైవుంటుంది. అయితే నా ఉత్పత్తికి సంబంధించినంత వరకూ నీ అవసరం, నీ కోరికలు, నీ సంకల్పం అన్నీ అశక్తమైనవిగా వుంటాయి. కనుక నీ మానవ సారాంశం - తద్విధంగా నా ఉత్పత్తితో ఒక అంతరంగిక సంబంధం అవశ్యంగా కలిగివుండే నీ ఆ మానవ సారాంశం, నా ఉత్పత్తిపై ఎలాంటి అధికారంగాని, ఆస్తిగాని సముపార్జించుకొని వుండజాలదు; ఎందుకంటే, మానవ సారాంశపు విలక్షణతత్వాన్నీ, శక్తి-అధికారాల్నీ నా ఉత్పతి గుర్తించదు గనుక. [కాకపోగా] అవి నీవు నాపై ఆధార పడి వుండేలా చేసే సంకెళ్లవంటివని చెప్పడమే మరింత సజావుగా వుంటుంది; ఎందుకంటే అవి నా ఉత్పత్తిపై ఆధారపడి వుండాల్సివచ్చే స్థితిలోకి నిన్ను ఒడుపుగా నెట్టివేస్తాయిగనుక. నా ఉత్పత్తిపై నీకు అదుపు-అధికారాలిచ్చే సాధనాలుగా వుండడం అటుంచి [అది కాదు సరిగదా] నిజానికి అవి [నీ అవసరాలు, కోరికలు, సంకల్పం, మానవ సారాంశపు విలక్షణత్వాలు] నీ పై నాకు అధికారం ప్రసాదించే సాధనాలై వుంటాయి.
- 1844 నోటుపుస్తకాలు, కార్ల్‌ మార్క్స్‌ ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 119 పాదవివరణ.

ఆస్తిపర వర్గం, అలాగే అధోకార్మికవర్గం రెండూకూడ ఒకే మానవ పరాయీకరణను సమర్పిస్తాయి. కాని వీటిల్లో మొదటి వర్గం తన ఈ స్వీయ పరాయీకరణలో తన సొంత ధ్రువీకరణనూ, తన మంచినీ – అంటే తన అధికారశక్తిని కనుగొంటుంది; అందులో [స్వీయ పరాయీకరణలో] దానికి [ఆస్తిపర వర్గానికి] ఒక మానవ అస్తిత్వపు పోలిక వుంటుంది. కాగా అధోకార్మిక వర్గం [మట్టుకు] తన స్వీయ పరాయీకరణలో తాను నిర్మూలమైపోతున్నట్లు అనుభూతి చెందుతుంది. దానిలో [తన స్వీయ పరాయీకరణలో] అది తన సొంత అశక్తతనూ, ఒక అమానుష అస్తిత్వపు వాస్తవికతనూ చూచుకొంటుంది. హెగెల్‌ మాటల్లో అధోకార్మిక వర్గం అవమానితమై (దిగజార్చబడి abased) ఆ అవమానం (దిగజార్చబడడం abasement) పట్ల ఆగ్రహోదగ్రమై వుంది; దాని (అధోకార్మిక వర్గపు) మానవస్వభావానికీ, ఆ స్వభావానికి నేరుగా, నిర్ణయాత్మకంగా, సంపూర్ణంగా అభావీకరణ (నిరాకరణ - negation) గా వుండే దాని జీవన పరిస్థితులకూ నడుమ గల వైరుధ్యం దాన్ని అనివార్యంగా ఇలాంటి ఆగ్రహోదగ్రతకు నెట్టివేస్తుంది.
కనుక ఈ ప్రతివాదం (లేక విరుద్ధవాదం - antithesis) లో ప్రైవేటు యజమాని యథాతథవాద (పూర్వాచార) పక్షంలోనూ, అధో కార్మికుడు విధ్వంసక పక్షంలోనూ వుంటారు. మొదటి వర్గం (ప్రైవేటు యజమాని) నుండి ఈ విరుద్ధవాదస్థితిని పరిరక్షించే, [కాగా] రెండవ వర్గం (అధోకార్మికుని) నుండి ఆ స్థితిని నిర్మూలించే కార్యాచరణలు పుట్టుకొస్తాయి. – పవిత్ర కుటుంబం (1845), కార్ల్‌ మార్క్స్‌ ఎంపికచేయబడ్డ రచనలు, పు. 134.

కార్యకలాపాల సాంఘిక లక్షణం, ఉత్పత్తియొక్క సాంఘిక రూపం, అలాగే ఉత్పత్తిలో వ్యక్తికుండే వాటా యివన్నీ ఇక్కడ ఏవో పరాయివైనట్లు, కేవలం పాదార్థికమైనవైనట్లు వ్యక్తులకు ఎదురు పడుతుంటాయి. కొంతమంది వ్యక్తులు వేరే యితర వ్యక్తులతో నెరిపే ప్రవర్తనలా యిది వుండదు; కాగా, తమకు స్వతంత్రంగా మనివుండే, ఎవరో ఏమీ పట్టనట్లుండే వ్యక్తులు ఒకరితో మరొకరు ఢీకొట్టుకొనే పరిణామంవల్ల జనించే సంబంధాలకు వాళ్లు అధీనులయ్యేలా వుంటుంది. ప్రతి వ్యక్తికీ ఒక జీవన షరాస్థితిగా వుంటూ, వ్యక్తుల నడుమ ఒక లంకెగా రూపొందినటువంటి కార్యకలాపాలు, ఉత్పత్తుల సాధారణ మారకం వాళ్లకు ఏదో పరాయిదిగా, స్వతంత్రమైనదిగా, ఏదో ఒక వస్తువులా అనిపిస్తుంది (లేక అగుపడుతుంది).
మారకపు విలువలో వ్యక్తుల మధ్యని సాంఘిక సంబంధాలు భౌతిక (పాదార్థిక) వస్తువుల నడుమలి సాంఘిక బంధాలుగా పరివర్తన చెందుతాయి; వ్యక్తిగత అధికారశక్తి భౌతిక అధికార శక్తిగా మారిపోతుంది. మారకపు సాధనాలకుండే సాంఘిక అధికారశక్తి ఎంత తక్కువగా వుండి, ప్రత్యక్ష శ్రమ (ఉత్పత్తి) ఫలపు నిజ స్వభావంతోనూ, మారకం చేసుకునే వాళ్ల తక్షణ అవసరాలతోనూ అవి (మారకం సాధనాలు) యింకా ఎంత సన్నిహితంగా పెన వేసుకుని వుంటే, అప్పుడు వ్యక్తులను కలగలపడానికి (సన్నిహితంగా కట్టివేయడానికి) సంఘసముదాయానికి వుండే అధికారశక్తికూడ అంత హెచ్చుగానే వుండితీరుతుంది: [ఉదాహరణకు,] పితృస్వామిక సంబంధాలు, ప్రాచీన జనసముదాయాలు, ఫ్యూడలిజం, గిల్డు వ్యవస్థలు. ప్రతి వ్యక్తీ సాంఘిక అధికారశక్తిని ఒక భౌతిక వస్తువు రూపంలో కలిగివుంటాడు. [కనుక మరి] ఆ [భౌతిక] వస్తువుయొక్క సాంఘిక [అధికార] శక్తి హరించబడితే, అప్పుడు ఈ [సాంఘిక అధికార] శక్తిని ప్రజలే ప్రజలపైనేగా చెలాయించవల్సి వుంటుంది.
వ్యక్తిగత అధీనతా (లేక ఆశ్రయ) సంబంధాలు [ఇవి మొదట్లో పూర్తిగా అయత్నపూర్వకమైనవి (వాటంతటవే పుట్టుకొచ్చినవి) గా వుండినాయి] మానవ ఉత్పాదకత అభివృద్ధిచెందే – ఆ అభివృద్ధి స్వల్పమైన మేరకు, ఎక్కడో చెదురు తావుల్లో మాత్రమే జరిగినా – తొలి సమాజ రూపాలుగా వుండినాయి. పోతే పాదార్థిక (భౌతిక) పరాధీనత పునాదిపై వ్యక్తిగత స్వాతంత్ర్యం నెలకొనడమనేది రెండవ పెద్ద (సమాజ) రూపంగా వుండింది – ఈ రూపంలోనే మొట్టమొదటి సారిగా ఒక సాధారణ సాంఘిక ఇచ్చిపుచ్చుకోలు (మారకం - interchange) అభివృద్ధి చెందింది. దాని ఫలితంగా సార్వత్రిక సంబంధాలు, వైవిధ్యతాపూర్వక అవసరాలు, సార్వత్రిక సామర్థ్యాలు పుట్టుకొచ్చాయి. పోతే వ్యక్తుల సార్వత్రిక వికాసం, వారి సంఘశక్తిగా రూపొందిన వారి సాముదాయిక, సాంఘిక ఉత్పాదకతల యొక్క ఆధిపత్యాల పునాదిపై నెలకొన్న స్వేచ్ఛా వ్యక్తిత్వం అనేది మూడవ దశగా వుండగలదు. వ్యాపారం, విలాసాలు, డబ్బు, మారక విలువలు వృద్ధిచెందే కొద్దీ, వాటి సరసనే ఏకకాలంలో ఆధునిక సమాజం ఎలా పుట్టిపెరుగుతూ వస్తున్నదో సరిగ్గా అదే విధంగా పితృస్వామిక, పురాతన సమాజాలూ (ఫ్యూడల్‌ సమాజంకూడ) క్షీణించిపోతాయి. - మార్క్స్‌, గ్రండ్‌రిస్సే (1857-58), పు. 66 నుండి...

పరాయీకరణ గురించి మార్క్స్‌-1

పరాయీకరణ గురించి మార్క్స్‌ - 1
పరాయీకరణ
వ్యాఖ్యానం
పరాయీకరణగురించిన మార్క్స్‌ భావన అత్యంత ప్రత్యక్షంగా హెగెల్‌నుండి వచ్చిందే (తెచ్చుకొన్నదే). అయితే ఈ పరాయీకరణ భావనకు మూలాలుమాత్రం అంతకు చాలపూర్వంనుండే ఊనుకుని వున్నాయనుకోండి. వాస్తవికత అంటే మనోబలం లేక లోసత్తువ (స్పిరిట్ – 'ఉసురు' అనికూడ అనవచ్చా?) తన్ను తాను సాధించు కోవడమే (యథార్థీకరించుకోవడమే) అని హెగెల్‌ భావిస్తాడు. తర్వాత తర్వాత ఈ లోసత్తువ ఈ ప్రపంచాన్ని తన స్వీయసృష్టిగా పరిగణించడం మొదలుపెట్టింది. తన ఉత్పాదక కార్యకలాపంలో, ఆ కార్యకలాపంద్వారామాత్రమే ఉనికిలోకి వచ్చివుండిన లోసత్తువ క్రమక్రమేపీ తన్ను తాను బాహ్యీకరించుకొంటున్నట్లు లేక పరాయీ కరించుకొంటున్నట్లు చైతన్యం సంతరించుకోసాగింది. హెగెల్‌కు సంబంధించి పరాయీకరణ అనేది ఈ ప్రపంచం లోసత్తువకు వెలుపలవుండేదేమీ (బాహ్యమైనదేమీ) కాదనే విషయాన్ని గుర్తించ విఫలమవడంలో యిమిడివుంది. కనుక తమ ప్రకృతిపరిసరాలు, తమ సంస్కృతి ఈ లోసత్తువయొక్క సృజనలని మనుషులు గ్రహించినప్పుడు ఈ పరాయీకరణ మటుమాయమౌతుంది (ముగిసి పోతుంది). ఇది గ్రహించినప్పుడు మనుషులు స్వతంత్రులవుతారు; మరి మానవుని స్వాతంత్ర్యమేగదా చరిత్ర ధ్యేయం (లక్ష్యం). హెగెల్‌ భావన అంటే తాను (అర్థం చేసుకుని) భావించేది యిదని మార్క్స్‌ యిలా సంగ్రహీకరించి చెబుతాడు:
హెగెల్‌కు సంబంధించి మానవసారం – మనిషి – అన్నా, స్వీయ (ఆత్మ) చైతన్యమన్నా ఒకటే. కనుక మానవ సారపు పరాయీకరణ అంటే ఆత్మచైతన్యపు పరాయీకరణేతప్ప మరొకటి కాదు. ఈ ఆత్మ చైతన్యపు పరాయీకరణ అనేదాన్ని, ఎరుక (జ్ఞానం) లోనూ, ఆలోచనలోనూ ప్రతిఫలించబడే మానవ సారపు యథార్థ వ్యక్తీకరణగా భావించరాదు. తత్వవిజ్ఞానం మొట్టమొదటగా వెలుగులోకి తెచ్చిన, దాని అంతర్గత గుప్త సారాంశంలోని నిజమైన పరాయీకరణ (లేదా అలా నిజంగా అగుపించే పరాయీకరణ) అనేది యథార్థ మానవ సారపు – అంటే ఆత్మచైతన్యపు పరాయీకరణ యొక్క ప్రస్ఫుట రూపం తప్ప మరేమీ కాదు.[1]
అయితే హెగెల్‌పై మార్క్స్‌ చేసే కేంద్ర (ప్రధాన) విమర్శ అంతా ఈ పరాయీకరణ అనేది బాహ్య ప్రపంచపు రద్దు అనుకోబడే పరిణామంతో ఆగిపోయేదేమీ కాదనే. మార్క్స్‌ ప్రకారం బాహ్య ప్రపంచం మనిషి ప్రకృతిలో ఒక భాగమే; కనుక మనిషికీ అతడి పరిసరాలకూ (పర్యావరణానికీ) నడుమ ఒక సజావైన సంబంధం నెలకొల్పడమే అతి ముఖ్యమైన (కావల్సిన) విషయం.
[మార్క్స్‌ రాస్తాడుగదా] ఏదైనా ఒక భౌతిక అస్తిత్వానికి (objective being) ఒక భౌతిక ప్రభావం వుంటుంది. మరి ఆ అస్తిత్వపు ఉనికిలో గనుక ఒక భౌతిక మూలాంశం చేరిలేకుంటే దానికి అలాంటి భౌతిక ప్రభావం వుండజాలదు. అది వస్తువులచే స్థితినిశ్చయం గావించ బడుతుంది గనుకనే, ఎందుకంటే అది పుట్టుకతో సహజసిద్ధమై వుంటుంది గనుకనే, అది వస్తువుల్ని సృష్టించగలుగుతుంది; స్థితి నిశ్చయం చేయగలుగుతుంది. కనుక యిలా స్థితినిశ్చయం గావించే చర్యలో అది ఒక వస్తువును సృష్టించే 'శుద్ధ కార్యకలాపం' నుండి ఏమీ దిగజారడం లేదు; దాని భౌతిక (ఉత్పత్తి) ఫలం కేవలం దాని భౌతిక కార్యకలాపాన్ని – ఒక భౌతిక, సహజసిద్ధ అస్తిత్వపు కార్య కలాపంగా వుండే దాని కార్యకలాపాన్ని – ధ్రువీకరిస్తున్నదంత మాత్రమే.[2]
ఈ విధంగా మార్క్స్‌ లోసత్తువ అనే భావననే తిరస్కరిస్తాడు; అలాగే బాహ్య ప్రపంచానికి విరుద్ధంగా ఈ లోసత్తువకు వుంటుందని భావించబడే ప్రతివాదం స్థానే మనిషికీ, అతడి సాంఘిక అస్తిత్వానికీ నడుమ వుండే ప్రతివాదాన్ని తెచ్చిపెడతాడు.
ప్రత్యేకించి తన తొలి రచనల్లో మార్క్స్‌ వివిధ రకాల పరాయీకరణలగురించి చర్చిస్తాడు. యువ హెగెలియన్‌లందరికీ సామాన్యంగా వుండే ఒక ఉధృతమైన లౌకికీకరణ క్రమంలో సాగిపోతూ మొదట మతపరమైన పరాయీకరణనుండి తాత్విక పరాయీకరణకూ, ఆపై అటునుంచి రాజకీయ పరాయీకరణకూ, అంతిమంగా ఆర్థిక పరాయీకరణకూ పయనిస్తాడు. పని చేయడం (శ్రమ) అనేది మనిషి యొక్క మౌలిక కార్యకలాపంగా వుండడంవల్ల, ఆ మేరకు ఈ చివరిదాన్ని – అంటే ఆర్థిక పరాయీకరణను – మౌలికమైందిగా పరిగణిస్తాడు మార్క్స్‌. ఈ అన్ని రంగాల్లోనూ సామాన్యమైన భావన ఏమంటే తన ప్రకృతికి (సహజ స్వభావానికి) ప్రధానావశ్యకమైన అంశాన్ని – అంటే తన సొంత కార్యకలాపాలపై అదుపాజ్ఞలు తానే ప్రముఖంగా కలిగివుండడం, చారిత్రక క్రమానికి ఆవిష్కర్త తానుగా వుండడం అనే అంశాన్ని మనిషి మరెవరికో లేక మరేదానికో (మరే అంశానికో) కోల్పాయాడనేదే. ఈ వివిధ పరాయీ కరణ రూపాల్లో జరిగిందేమంటే, అసలు మనిషికి సముచితంగా చెందవల్సిందాన్ని వేరే మరే అస్తిత్వమో పొందడమే (కొట్టేయడమే).
ఉదాహరణకు మతంలోనైతే మనిషి (కి చెందవల్సిన) స్వీయ స్థితిని దేవుడు ఆక్రమించుకున్నాడు; బరువు బాధలకు పరిహారం గానూ, అలాగే మనిషియొక్క అత్యంత ప్రగాఢమైన కోరికల అభివ్యక్తీకరణకు మాధ్యమంగానూ ఒక ద్వంద్వ (రెండందాల) విధిని మతం నిర్వర్తిస్తుంది. మతమంటే 'మానవ సారపు (మానవ సారాంశం యొక్క) ఊహాత్మక సాధన – ఎందుకంటే మానవ సారాంశానికి అసలు నిజమైన వాస్తవికత ఏదీ వుండదుకాబట్టి,'[3] అంటాడు. ఇక మార్క్స్‌ చెప్పిన తీర్పు: "ప్రజలయొక్క భ్రమాత్మక ఆనందంగా వుండే మతాన్ని రద్దు చేయడం (మతం రద్దు) అంటే వాళ్ల వాస్తవిక ఆనందంగురించి డిమాండు చేయడమే. తమ పరిస్థితులగురించిన భ్రమల్ని వాళ్లు వదులుకోవాలని గట్టిగా అడగడమంటే అలాంటి భ్రమను ఆవశ్యకంగావించే పరిస్థితిని విసర్జించాలని (రూపు మాపాలని) డిమాండు చేయడమే."[4]
మరి తత్వచింతన (తత్వవిజ్ఞానం - philosophy) కూడ (ఇక్కడ మార్క్స్ ప్రత్యేకించి హెగెల్‌ తత్వచింతనను మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడని గమనించాలి) పరాయీకరణని కలగజేయ (ఏర్పరచ) వచ్చు. ఊహాగానాల తత్వచింతన (speculative philosophy) చరిత్రనూ, మనిషినీ ఒక మానసిక క్రమంగా కుదించివేసింది. దేవుని స్థానే 'భావన' (idea) ను తెచ్చిపెట్టిన అది (ఊహాగాన తత్వచింతన) లౌకికీకృత మతవిజ్ఞానం (secularized theology) కంటే ఏమాత్రం మెరుగుకాదు. "ఈ విధంగా, మనిషియొక్క కర్మపదార్థీకృత (objectified), పరాయీకృత ప్రతిభాశక్తుల (లేక యుక్తుల faculties) భుక్తం (appropriation వినియోగం) హెగెల్‌ చెప్పేప్రకారమైతే మొదటగా మనసులో సంభవించే, శుద్ధ ఆలోచనలో సంభవించే అంటే ఒక అనిర్దిష్టతలో సంభవించే ఒక భుక్తం (లేక వినియోగం) గా మాత్రమే వుంటుంది,"[5] అంటాడు మార్క్స్‌.
యిదే విశ్లేషణను మార్క్స్‌ రాజకీయ పరాయీకరణకూ అన్వయించాడు. రాజ్యం అనేది ఒక మానవస్వభావ వర్ణనను కలిగివుంటుంది (నిజమే) గానీ అదే సమయంలో అది (రాజ్యం) మనషి దాన్ని (అంటే ఆ మానవ ప్రకృతిని) సాధించుకొనే అవకాశాన్ని హరించివేస్తుంది.
పూర్వం (మొదట్లో) మతపర రంగమే రాజకీయ రాజ్యాంగమై వుండింది. అంటే ప్రజాజీవనపు మతం, దాని వాస్తవిక, ఐహిక మనుగడకు విరుద్ధంగా, అతీతంగా దాని (ప్రజాజీవితపు) సార్వత్రికత (లేక విశ్వ జనీనత)కుసంబంధించిన స్వర్గంగా [ఈ రాజకీయ రాజ్యాంగం] వుండింది. ఈ రంగం ఒక్కటే రాజ్యంలోని ఏకైక రాజ్య రంగంగా వుండింది; తెగ జాతికి, సిసలైన సార్వత్రికతకూ సంబంధించిన సారాంశమే దాని సారంగానూ, అలాగే రూపంగానూ కూడ వుండిన ఏకైక రంగంగా వుండింది. అదే సమయంలో యితర రంగాలకు పైగా, విరుద్ధంగా నిలిచి వుండడంచేత తన సారాంశంకూడ ఒక ప్రత్యేకమైందిగా, లాంఛనమైందిగా రూపొందిన చందంగా ఈ రంగం నిలిచివుండింది. [కాగా] ఆధునిక రాజ్యంలో రాజకీయ రంగం ప్రజాజీవితపు పాండిత్య తత్వం (పాండిత్యప్రకర్ష) గా వుంటుంది. రాచరికం ఈ పరాయీకరణకు ఒక సమగ్రీకృత వ్యక్తీకరణై వుండగా, గణతంత్రవాదం (రిపబ్లికనిజం) దాని స్వీయక్షేత్రంలోనే దాని రుణాత్మక అంతర్గతంగా వుంటుంది."[6]
పరాయీకరణగురించి మార్క్స్‌ అత్యంత సంపూర్ణంగా చర్చించే రచనాభాగాలు మనకు పారిస్‌ రాతప్రతులు లో కనిపిస్తాయి. ఇక్కడ మార్స్క్‌ మొట్టమొదటిసారిగా ఈ (పరాయీకరణ) భావనను ఆర్థిక శాస్త్రానికి అన్వయించడం గమనిస్తాము. ఇక్కడ 'పరాయీకృత శ్రమ' అనే ఉపశీర్షికకింద పెట్టుబడిదారీ విధానంలో కార్మికుని పరాయీకృత పరిస్థితిని మార్క్స్‌ నాలుగు రకాలుగా విభజించి వ్యవహరిస్తాడు:
[మార్క్స్‌ రాస్తాడుగదా,] తన స్వీయ శ్రమోత్పత్తితో కార్మికునికి వుండే సంబంధం [సైతం] ఏదో ఒక పరాయి వస్తువుతో వుండే సంబంధంలాగే వుంటుంది. అతడు సృష్టించే వస్తువు అతడికి చెందకపోగా, అతడిపై ఆధిపత్యం చెలాయిస్తుంది; ఇంకా దీర్ఘకాలంలో అతడి పేదరికాన్ని పెంచడానికే దోహదపడుతుందికూడ. ఈ పరాయీకరణ [తుది] ఫలంలోనేగాక దాని ఉత్పత్తిక్రమంలోనూ, అసలు స్వయంగా ఆ ఉత్పత్తికార్యకలాపంలో సైతం కనబడుతుంది. కార్మికుడు తన పనిలో ఇంటికుదురుగా వుండలేకపోతాడు. ఎందుకంటే ఆ పని కేవలం తన యితర అవసరాలు తీర్చు కొనేందుకుమాత్రమేనన్నట్లు భావిస్తాడుగనుక. అదేదో తనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడిన కార్యకలాపంగా, అంటే తనకు స్వతంత్రమైన, తనకు చెందని కార్యకలాపంగా చూస్తాడు. మూడవ దేమంటే పరాయీకృత శ్రమ మనిషిని అతడి తెగజాతినుండి వేరుగావించడం (పరాయి చేయడం) లో కృతకృత్యమవుతుంది. తెగ జీవితం, ఉత్పాదక జీవితం, జీవితాన్ని సృష్టించే జీవితం అన్నీ కేవలం కార్మికుని వైయక్తిక మనుగడను పోషించి సాగించే ఒక సాధనంగా మారిపోతాయి; మనిషి తన సాటి మనుషులనుండి పరాయి (వేరుగా) అయిపోతాడు. అంతిమంగా స్వయంగా ప్రకృతి సైతం మనిషినుండి పరాయిగా అయిపోతుంది; కనుక మనిషి తన సొంత అకర్బన శరీరాన్ని కోల్పోతాడు.
ఈ పై రచనాభాగాలలో పెట్టుబడిదారీ సమాజంలో స్పష్టంగా అత్యంత పరాయీకృత భాగమైవుండే కార్మికులగురించే ప్రస్తావించ బడి వుండడం నిజమే అయినా మార్క్స్‌ భావన ప్రకారం ఈ పరాయీకృత స్థితి అనేది ఆ సమాజంలోని సభ్యులందరికీకూడ సామాన్యంగా వర్తించేదే. ఆయన తన పవిత్ర కుటుంబం లో యిలా అంటాడు:
"యాజమాన్య వర్గమూ, అధోకార్మిక వర్గమూ రెండూ ఒకే మానవ స్వీయపరాయీకరణకు ప్రాతినిధ్యం వహిస్తాయి. కాకపోతే మొదటి వర్గం (అంటే యజమాని వర్గం) ఆత్మ-పరాయీకరణలో మరింత సౌకర్యవంతం (సుఖం) గా అనుభూతి చెందుతూ దాన్ని ధ్రువీకరిస్తుంది; అదే తన స్వీయాధికారానికి మూలమని గుర్తెరిగి, ఆ పరాయీకరణలోనే ఒక మానవ అస్తిత్వపు పై పై రూపాన్ని కలిగి వుంటుంది. కాగా రెండవ వర్గం (అంటే అధోకార్మిక వర్గం) ఈ పరాయీకరణలో తన వినాశాన్ని అనుభూతి చెందుతూ, దానిలో తన అశక్తతనూ, తన అమానవ అస్తిత్వ వాస్తవికతనూ చూస్తుంది."[7]
మార్క్స్‌ రచనల్లో పరాయీకరణ భావనకు కేంద్ర ప్రాధాన్యం వుంది. కాకుంటే, బహుశా దాని పూర్ణ తాత్విక అర్థసూచన మూలంగా కావచ్చు ఆయన ఆ పదాన్ని యథార్థంగా అలాగే వాడడం తక్కువ చేసే ధోరణి కనబరుస్తాడు. నిజానికి కమ్యూనిస్టు ప్రణాళిక లోనైతే ఆయన "డబ్బుయొక్క ఆర్థిక విధులపై సాగిన ఫ్రెంచి విమర్శ కింద మానవత్వపు పరాయీకరణ"[8] అని [శీర్షిక పెట్టి] రాసిన జర్మన్‌ సాహిత్యవేత్తలపై అవహేళన గుమ్మరిస్తాడు. అయితే ఈ [పరాయీకరణ] భావన మార్క్స్‌యొక్క గ్రండ్‌రిస్సే కు సంబంధించినంతవరకు మౌలికమైనదనే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అందులో, "కర్మపదార్థీకరణ స్థితిని గాక పరాయీకరణ, ఎడబాటు, విసర్జనల స్థితిని, సామాజిక శ్రమ తన మూలకాంశాల్లో ఒకటిగా తనకు తానే ఎదురు తెచ్చిపెట్టుకొన్న బ్రహ్మాండమైన భౌతికీకృత (లేదా కర్మపదార్థీకృత) శక్తి కార్మికునికిగాక పెట్టుబడిలో భౌతికీకృతమైన ((కర్మపదార్థీకృతమైన) ఉత్పత్తి పరిస్థితులకు చెందుతుందనే వాస్తవాన్ని"[9] మార్క్స్‌ నొక్కిచెబుతాడు.
ఇదే భావన పెట్టుబడి గ్రంథ ప్రారంభంలోనే 'వర్తకపు సరుకుల చిత్రమహిమ' (Fetishism of Commodities - సరుకుల మాయ అని మరో అనువాదం) అనే శీర్షికన పునరుక్తమౌతుంది. మార్క్స్‌ అంటాడు గదా:
"అందుచేత వర్తకపు సరుకు ఒక నిగూఢ (విచిత్ర, మార్మిక - mysterious) వస్తువుగా వుంటుంది – ఎందుకంటే దానిలో మనుషుల శ్రమయొక్క సాంఘిక స్వభావం ఒక శ్రమోత్పత్తి ఫలంపై ముద్రింపబడిన భౌతిక స్వభావంగా వాళ్లకు గోచరిస్తుందిగనుక, తమ సొంత శ్రమయొక్క వెరసిమొత్తంపట్ల ఉత్పత్తిదారులకు వుండే సంబంధం [వ్యక్తులుగా] వారి మధ్యవుండే బంధంగాకాక వాళ్ల శ్రమోత్పత్తి ఫలాలనడుమ నుండే ఒక సామాజిక సంబంధంగా వాళ్లకు సమర్పించబడుతుంది గనుక (అదిలా చిత్రమహిమాన్విత వస్తువై వుంటుంది). ఇందుకే శ్రమోత్పత్తి ఫలాలు వర్తకపు సరుకులుగా – ఒకే సమయంలో ఇంద్రియాలకు గ్రాహ్యం గానూ, అగ్రాహ్యంగానూ రెండందాలా వుండే గుణాలుగల సామాజిక వస్తువులుగా అవుతాయి… అంటే యిక్కడ మనుషుల మధ్య నిశ్చితమైన ఒక సాంఘిక సంబంధం వున్నా అది వారి కళ్లకు వస్తువులమధ్య నుండే ఒక విడ్డూరపు సంబంధంగా గోచరిస్తుంది… దీన్నే నేను చిత్రమహిమ (మాయ) అంటాను; శ్రమోత్పత్తి ఫలాలు వర్తకపు సరుకులుగా ఉత్పత్తి కావడంతోటే ఈ చిత్రమహిమ (మాయ) వాటిని ఆవరిస్తుంది."[10]
పరాయీకరణ అనేది మార్క్స్‌ ఏదో తన తాత్విక పసితనంలో వాడిన పదంమాత్రమే అని అనేకమంది రచయితలు అనివుండడం వల్ల, [అది సరికాదు!] ఆ పదం పెట్టుబడి లో పదే పదే మనకు కని పిస్తుందని గమనించడం యిక్కడ చాల ముఖ్యం.[11] నిజానికి దాని (పరాయీకరణ భావన) అంతరార్థం ప్రజలమధ్య సంబంధాల స్థానే వస్తువుల మధ్య సంబంధాలు చోటుచేసుకొంటాయి (తెచ్చిపెట్ట బడుతాయి) అన్నట్లయితే అది అసలుకు పెట్టుబడియొక్క ప్రాథమిక ఇతివృత్తాల్లోనే ఒకటని చెప్పవచ్చు. ఉదాహరణకు మార్క్స్‌ యిలా రాస్తాడు: "పనివ్యక్తికి విరుద్ధంగా శ్రమ పరికరాలు (సాధనాలు - instruments), ఉత్పత్తులకు పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాలు మొత్తంగా సమర్పించే స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు, ఎడబాటుల స్వభావం [ఆధునిక] యంత్రాలద్వారా ఒక సమగ్ర వైరం (శత్రుత్వం) గానే మార్చివేయబడుతుంది."[12] అయితే యిదంతా కేవలం ఏదో పరిభాష గురించిన సమస్యమాత్రమే కాదు; పెట్టుబడి యొక్క సారాంశంకూడ మార్స్క్‌ తొలి (పూర్వ) ఆలోచనలకు కొనసాగింపేనని చెప్పవచ్చు. పెట్టుబడి 1 వ సంపుటంలో ప్రధాన చర్చ అంతా పని (శ్రమ) కీ, విలువకూ మధ్యనుండే సమీకరణంపై ఆధారపడి వుంటుంది; అంటే అది మళ్లీ వెనక్కు – తన్ను తానూ, అలాగే తన జీవిత పరిస్థితులనూ రెంటినీ సృష్టించుకొనే జీవి మానవుడంటూ పారిస్‌ రాతప్రతులు లో రేఖాచిత్రణ చేయబడ్డ భావనకు – తిరిగి వెళ్లడం అవుతుందన్న మాట. పారిస్‌ రాతప్రతులు రాసిననాటి మార్క్స్‌ ప్రకారమైతే, తన తోటి యితర మానవుల సహకారంతో తననూ తనచుట్టూవున్న ప్రపంచాన్నీ నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ పోవడం మనిషి నిజస్వభావం. మరి (ఈ) చారిత్రక క్రమాన్ని ప్రారంభించి అదుపుచేసే వ్యక్తిగా మనిషి వహించే ఈ మౌలిక పాత్రను ఎలా బదిలీ చేయబడిందో, లేదా పరాయీకృతం గావించబడిందో, [ఇప్పుడు] అది పెట్టుబడియొక్క అమానవ అధికారశక్తికి ఎలా చెందివుందో మార్క్స్‌ తన పెట్టుబడి లో వర్ణించి చెబుతాడు. అలాగే ఈ పరాయీకృత మానవుడి ప్రతిరూపం (counterpart), అంటే రాతప్రతులులో పేర్కొన్న అపరాయీకృత, 'పూర్ణ' మానవుడు కూడ పెట్టుబడి లో మనకు అగుపిస్తాడు. పెట్టుబడి, సంపుటం 1 లోని 'యంత్రాలు - ఆధునిక పరిశ్రమ' పైని అధ్యాయంలో మార్క్స్‌, పరాయీకృత, అపరాయీకృత ఉత్పత్తి విధానాలు మానవ అంతస్థ శక్తుల వికాసంపై నెరిపే ప్రభావాల్లో అంతరాల్ని అదే మాదిరి (అంటే రాతప్రతులు లోలాగే) వివరించి చెబుతాడు. ఆయన అంటాడుగదా:
"నిజానికి ఆధునిక పరిశ్రమ ఈ నాటి ముక్కపని-కార్మికుడికి – అంటే, ఒకే అల్పమైన పనిముక్కను జీవితాంతం పునర్నిర్వర్తిస్తూ (మళ్లీ మళ్లీ చేస్తూ) [ఒక విధంగా] వికలాంగునిలా అయిపోయిన, ఆ విధంగా ఒక మనిషిముక్కగా కుదించుకుపోయిన నేటి ముక్కపని-కార్మికుడికి (detail-worker) - బదులుగా నానారకాల పనులు చేసే స్తోమతగల, ఏ ఉత్పత్తి మార్పుల్నయినా ఎదుర్కోవడానికి సంసిద్ధమై వుండే, తాను నిర్వర్తించే విభిన్న సాంఘిక విధులు తన సొంత సహజసిద్ధ, ఇంకా సముపార్జిత శక్తియుక్తులకు స్వేచ్ఛావికాస అవకాశం సమర్పించే వివిధ విధానాలుగామాత్రమే వుండే ఒక సంపూర్ణ వికసిత వ్యక్తిని తెచ్చిపెట్టేట్లు, ఒక మృత్యుదండనాభయం కల్పిస్తూ, బలవంతం (వత్తిడి) చేస్తుంది."[13]
ఈ తుది అభిప్రాయాన్ని (conclusion) పెట్టుబడి [గ్రంథం] లో పురోగమిత సాంకేతిక విజ్ఞాన ప్రభావాల సవివర విశ్లేషణద్వారా సమర్థించబడిందనే వాస్తవం [ఆ తుది అభిప్రాయానికిసంబంధించి] అంతకు ముందున్న [అంటే రాతప్రతులు నాటినుండేవున్న] నిరంతరాయతను కప్పిపుచ్చరాదు.
అయితే మార్క్స్‌ ఆలోచనల్లో పరాయీకరణ భావనకున్న కేంద్ర ప్రాముఖ్యం మనకు గ్రండ్‌రిస్సే(Grundrisse)§ లో కనిపిస్తుంది; అది 1941 దాకా అప్రచురితంగా వుండిన మార్క్స్‌యొక్క ముసాయిదా రాతప్రతి; దాని ఆధారంగానే మార్క్స్‌ ఆ తర్వాత తన పెట్టుబడి గ్రంథం రచించాడు. తర్వాతి రాజకీయార్థ శాస్త్ర విమర్శ, పెట్టుబడి గ్రంథాలు గ్రండ్‌రిస్సే కు పాక్షికమైన వివరణలుమాత్రమే; అది మార్క్స్‌ రచనల్లోకెల్లా కేంద్రప్రాధాన్యం గల రచన అని చెప్పవచ్చు. రాజకీయార్థశాస్త్ర విమర్శ కు రాసిన ప్రత్యేక పీఠికలో మార్క్స్‌ చేసిన సాధారణీకరణలకు ఆధారమైన మూల రచన అదే. పెట్టుబడి ద్వారా, రాజ్యంద్వారా జరిగిన మనిషి పరాయీకరణ క్రమంగురించి మార్క్స్‌ 'అర్థశాస్త్రం' అనే శీర్షికన ఒక ఆరు సంపుటాల మహాగ్రంథం (magnum opus) రాయ సంకల్పించాడనీ, అందులో పెట్టుబడి ఒక [మొదటి] సంపుటంమాత్రమేననీ మనమిక్కడ తెలుసుకోవాలి.
గ్రండ్‌రిస్సేయొక్క యోచనాపరిథి పెట్టుబడి [గ్రంథ] పరిథికంటే విస్తృతమైంది. కనుక మార్క్స్‌ 1844 లోనే ప్రారంభించిన ధ్యాన ప్రక్రియను అలా కొనసాగిస్తూపోయాడనీ, 1857-58 ప్రాంతాల్లో ఈ ధ్యానం పరాకాష్టకుచేరుకొందనీ గమనించడంద్వారా మనం మార్క్స్‌ఆలోచనావిధానాన్ని అత్యుత్తమంగా అవగతం చేసుకోగలం. రాత ప్రతులు కూ, గ్రండ్‌రిస్సే కూమధ్య నున్న నిరంతరాయత స్పష్టంగానే అగుపడుతుంది. స్వయంగా మార్క్సే తన ఒక లేఖలో, 'నేను పదిహేనేళ్లుగా చేసిన పరిశోధన ఫలితం గ్రండ్‌రిస్సే; ఈవిధంగా అది నా జీవితంలోనే అత్యుత్తమ కాలావధిలో రాయబడింది' అని చెప్పి వున్నాడుకూడ. ఆ లేఖ 1858 నవంబరులో, అంటే 1843 నవంబరులో మార్క్స్‌ పారిస్‌కు వచ్చిన ఘటనకు సరిగ్గా 15 ఏళ్ల తర్వాత రాయబడింది. ఇంకా తన 1859 నాటి పీఠికలో మార్క్స్‌, “[ఇందుకుసంబంధించిన] మూల సమాచారం మొత్తమూ నావద్ద ఏకాంశరచనల రూపంలో పడివుంది; అవన్నీ ప్రచురణకోసం గాక స్వీయవివరణకోసమని వేర్వేరు విశాల కాలాంతరాల్లో రాయబడ్డవి. వాటన్నింటినీ ప్రణాళికాబద్ధంగా, సుసంగతంగా రూపొందించి వివరంగా రాయాలంటే అదంతా [అనేక] బాహ్యపరిస్థితులపై ఆధార పడివుంటుంది మరి,"[14] అని అంటాడుకూడ. ఇది కేవలం 1844 నాటి రాతప్రతులు, ఆ తర్వాతి ఆయనయొక్క 1850-52 లండన్‌ నోటుపుస్తకాల కు సంబంధించిన ప్రస్తావనే అయివుండగలదు. తాను అంతకు ముందు రాసుకున్న విషయసమాచారాల్ని మార్క్స్‌ నిరంతరం ఉపయోగించుకోవడమేగాక, అదే సమయంలో వాటిని సరిచూచుకుంటూకూడ వచ్చేవాడని మనమిక్కడ గమనించాలి. ఉదాహరణకు పెట్టుబడి రాసేటప్పుడు ఆయన తన 1843-45 నాటి నోటుపుస్తకాల్ని [సైతం] వాడుకున్నాడు.
ఈ గ్రండ్‌రిస్సే లోని విషయాల్ని గమనిస్తే బాహ్య సాక్ష్యాధారాల వల్ల స్పష్టంగా కనిపించే విషయాలు ధ్రువీకరించబడుతాయి: అందులో పెట్టుబడిపై రాసిన అధ్యాయం మొదట్లో మానవ అవసరాలు, ఒక తెగజీవిగా మనిషి, ఒక సంఘజీవిగా వ్యక్తి, ప్రకృతిని ఒక విధంగా మనిషి దేహంతో పోల్చి చూసే భావన, మతపర, ఆర్థిక పరాయీకరణల మధ్య సామ్యాలు, ఊహాస్వర్గవాద, స్వర్ణయుగవాద అంశాలు వగైరాలకు సంబంధించి రాసిందంతా రాతప్రతులు లోని రచనాభాగాలనుండి దాదాపు ముక్కస్య ముక్కగా తీసుకున్నదేనని గమనిస్తాము. ప్రత్యేకించి ఒక అంశం ఈ నిరంతరాయతను నొక్కి చెబుతుంది – అదేమంటే, పారిస్‌ రాతప్రతులు ఎలాగో, ఎంతగానో గ్రండ్‌రిస్సేకూడ అలాగే, అంతగానూ హెగెల్‌వాదపూరితంగా వుంటుంది; రెంటిలోనూ పరాయీకరణ అనేదే కేంద్ర భావనగా వుంటుంది.[15]
[1] కారల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 102.
[2] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 103 పాదవివరణ.
[3] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 63.
[4] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 64.
[5] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 100.
[6] కార్ల్‌ మార్క్స్, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 29 పా.వి.
[7] కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పు. 134 పా. వి.
[8] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 241.
[9] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 384.
[10] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 435 పా. వి.
[11] ఉదాహరణకు పెట్టుబడి, 1937 లండన్‌ ఎడిషన్‌కు సూచికను చూడండి. మార్క్స్‌ ఆలోచనలో పరాయీకరణ భావన కొనసాగుతూండడం గురించి ఆర్‌. దునయేవ్‌స్కయా, మార్క్సిజం – స్వాతంత్ర్యం, న్యూయార్క్‌, 1968, పు. 103 నుండి కొన్ని పుటలు, ఎరిక్‌ ఫ్రామ్‌, మనిషి గురించి మార్క్స్‌ భావన, న్యూయార్క్‌, 1961, పు. 50 నుండి కొన్ని, పు. 69 నుండి కొన్ని పుటల్లో చెప్పబడింది. అలాగే ఓల్‌మన్‌, సీగెల్‌ల పుస్తకాలుకూడ చూడండి.
[12] పెట్టుబడి, 1 వ సంపుటం, పు. 432.
[13] పై గ్రంథమే, పు. 488.
§ గ్రండ్‌రిస్సే - Grundrisse der Kritik der Politischen Ökonomie (German: Outlines of the Critique of Political Economy) రాజకీయార్థశాస్త్ర విమర్శయొక్క రేఖాచిత్రణ.
[14] కార్ల్‌ మార్క్స్‌, ఎంపికచేయబడ్డ రచనలు, పు. 388.
[15] ప్రత్యేకించి చూడు: కార్ల్‌ మార్క్స్‌, ఎంపిక చేయబడ్డ రచనలు, పుట 305 తర్వాతనుండీ, ఇంకా పుట 371 తర్వాతనుండీ.